రాష్ట్ర శాసన సభకు డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల సందర్భంగా ఓటు ఎందుకు వేయాలి, ఎలా వేయాలి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు ఎలా ఉంటుంది, వీవీప్యాట్ పనితీరు తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా హైదరాబాద్ జిల్లాలోని ప్రతి ఓటరుకు వివరించేలా లఘు పుస్తకాన్ని ముద్రించి పంపిణీ చేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంపొందించడానికి చేపట్టిన చైతన్య కార్యక్రమాల్లో భాగంగా నేడు నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్.తిఒక్కరు పాల్గొనేలా చేసేందుకు పెద్ద ఎత్తున చైతన్య, అవగాహన కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వివిప్యాట్లు ఓటింగ్ విధానం మరింత పారదర్శక నిర్వహణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. ఈ నెల 24, 25వ తేదీలలో బూత్లేవల్ ఏజెంట్లతో సూపర్వైజర్లు, బి.ఎల్.ఓలు సమావేశం నిర్వహించి 26వ తేదీ నుండి చేపట్టే ఓటరు స్లిప్లు, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వివరాలను అందజేస్తారని దానకిషోర్ వెల్లడించారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్లు, కాలనీ సంక్షేమ సంఘాలు ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియాతో పాటు ఫ్లాష్ మాబ్, మొబైల్ వాహనాలు, బస్తీ సమావేశాల ద్వారా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యునిటీ డెవలప్మెంట్ విభాగం అడిషనల్ కమిషనర్ హరిచందన ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా నేడు నక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున నగర మహిళలు పాల్గొని తమ సృజనాత్మకతను ప్రతిబింబించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యత, ఈవీఎం, వివిప్యాట్ల ప్రదర్శన, ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలపర్చుదాం, మన ఓటు మన భవిత తదితర స్పూర్తిదాయక నినాదాలను ప్రతిబింబించే విధంగా వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గుల పోటీల్లో దివ్యాంగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సారి ఎన్నికల్లో దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలియజేసే ముగ్గులను కూడా వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో విజేతలకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ హరిచందన బహుమతుల ప్రధానం చేశారు.