విజయవాడలో దారుణం జరిగింది. బీసెంట్ రోడ్లో పట్టపగలు జనాలంతా చూస్తుండగానే.. గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలిపోతూ.. ప్రాణ భయంతో బాధితుడు రోడ్డుపైకి పరుగులు తీయగా.. పక్కనే షాపులో ఉన్న ఓ యువకుడు నీళ్లు తెచ్చి పోశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యాపారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారంలో వివాదంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్, సుధాకర్ అనే ఇద్దరు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు బాధితుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. 80 శాతం గాయాలపాలైన ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మాదాల సుధాకర్, మాదాల సురేష్ అనే వ్యక్తులు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారని పోలీసులకు గగారిన్ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపును మొదలుపెట్టారు. తోటి ఫైనాన్సర్లతో వివాదాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.