YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రహదారుల విస్తరణకు ఎన్డీబీ 6400 కోట్ల రుణం

 ఏపీలో రహదారుల విస్తరణకు ఎన్డీబీ 6400 కోట్ల రుణం
రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధి.. విస్తరణ.. అనుసంధానానికి మార్గం సుగమమైంది. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలు, మండల కేంద్రాల నుంచి సమీప మండలాలకు రెండువరుసల రహదార్లను ఏర్పాటు చేయటం ద్వారా కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఏపీ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ), ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ పేర్లతో రోడ్లు, భవనాలశాఖ రెండు రహదారి నిర్మాణ పథకాలను ప్రతిపాదించింది. వీటిలో ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 3200 కోట్ల వంతున రూ. 6400 కోట్ల మంజూరుకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ముందుకొచ్చింది. రాజధాని అమరావతిలో వౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందని, రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదార్లను సీసీ రోడ్లుగా మార్చడంలో దేశంలోనే ముందు నిలిచామన్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో భాగంగా రోడ్లు భవనాలశాఖ ప్రతిపాదించిన రెండు ప్రాజెక్ట్‌లకు రూ. 6400 కోట్ల సహాయం అందించేందుకు ముందుకువచ్చిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను అభినందించారు. వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచిందని, ఉపాధి కల్పనలోనూ అగ్రస్థానంలో ఉందని వివరించారు. ప్రజలు మెరుగైన ప్రమాణాలతో జీవించే రాష్ట్రాల్లో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దాలనేది తన సంకల్పంగా చెప్పారు. అభివృద్ధిలో అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు సాంకేతికత, ఆవిష్కారాలకు ప్రధాన్యత ఇస్తామన్నారు.రాష్ట్ర రహదార్ల విస్తరణలో భాగంగా జిల్లా ముఖ్య కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు 792 కిలోమీటర్లు, మండల కేంద్రాల నుంచి సమీప మండలాలకు 2219 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదార్లుగా మార్పుచేసేందుకు ఏపీ రహదారులు, వారధుల పునర్నిర్మాణ సంస్థ (ఏపీఆర్‌బీఆర్‌పీ) ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా 132 కొత్త వారధులు నిర్మిస్తారు. బలహీనంగా, ఇరుకుగా ఉన్న మరో 300 వారధులను కూడా పునర్నిర్మిస్తారు

Related Posts