తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కేసీఆర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. తెరాస శాసనసభాపక్షం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కేసీఆర్ను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ రాజీనామాను ఆయన కార్యదర్శి రాజ్భవన్కు అందజేశారు.ఆర్నెల్లకు ముందుగానే శాసన సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ వ్యూహం ఫలించింది. సెప్టెంబర్ 6న కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్ సూచన మేరకు అప్పటినుంచి కేసీఆర్ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో ఈ నెల 7న ఎన్నికలు జరగ్గా.. నిన్న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తెరాస 88 స్థానాలతో విస్పష్ట మెజార్టీని సాధించి రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.