YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

త్వరలో గ్రూప్ వన్ ఉద్యోగాలు

త్వరలో గ్రూప్ వన్ ఉద్యోగాలు
ప్రభుత్వం ఆమోదం లభించి, తమకు అప్పగించిన పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేసి, పరీక్షలను పూర్తిచేశామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ వద్ద ఎలాంటి ప్రతిపాదనలు అపరిష్కృతంగా లేవని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో వివిధ విభాగాల్లోని మొత్తం 36,182 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేశామని, వీటిలో 16,050 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విధుల్లో ఉన్నారని తెలియజేశారు. ఇంకా, మరో 14,488 ఉద్యోగాలకు రాత పరీక్షలు నిర్వహించి, ఫలితాలు, మెరిట్ జాబితాను ప్రకటించి, ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తిచేశామన్నారు. వీటికి సంబంధించి తుది నియామక జాబితాలను వెల్లడించాల్సి ఉందని వివరించారు. టీఎస్‌పీఎస్సీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా నాలుగేళ్ల ప్రగతి నివేదికను వాణీ ప్రసాద్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కార్యదర్శి వాణీప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ 30 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వడంలో జాప్యం కారణంగా 3,754 పోస్టులకు మెరిట్‌లిస్ట్ ప్రకటించలేకపోయామని తెలిపారు. అలాగే మల్టీజోనల్‌ ప్రకారం పోస్టుల విభజన పూర్తయితే త్వరలోనే గ్రూప్‌-1,3 ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల విభజన ప్రక్రియ సీఎస్‌ సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్దేశించిన అర్హతలపై పలువురు నిరుద్యోగులు న్యాయస్థానాలకు ఆశ్రయించారని, టీఎస్‌పీఎస్సీ నియామకాలపై 600 కేసులు దాఖలయ్యాయని అన్నారు. కోర్టు కేసులను అధిగమిస్తూ ఒక్కో నియామక ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 53 రకాల సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిన మార్కుల పర్సంటేజీ, విద్యార్హతల విషయంలో కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారని, దీనిపై దాదాపు 110 కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులను పరిష్కరించుకుంటూ నియామకాలు పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోందని అభిప్రాయపడ్డారు.  

Related Posts