అదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదై మరో కశ్మీర్ను తలపిస్తోంది. మంగళవారం కనిష్టం 3.8 గరిష్ట ఉష్ణోగ్రత 21.1నమోదైంది. గతేడాది ఇదే నెలలో 7.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా.. గరిష్ట ఉష్ణోగ్రత 28.3డిగ్రీలు నమోదైంది. దక్షిణ పీఠభూమిపై ఆదిలాబాద్ ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో ఉత్తరభారత దేశంలో నుంచి వచ్చే శీతల పవనాలు ప్రభావంతో ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 2014లో 3.9 డిగ్రీలు నమోదు కాగా.. మూడేళ్ల తర్వాత ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉదయం నుంచి చల్లటి గాలులు వీయడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రజలు బయటకు వెళ్లడానికి స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించారు. అటవీ ప్రాంతంలో ఉన్న బోథ్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాలతో పాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు సాయంత్రం 4గంటల నుంచే చలి మంటలను వేసుకున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు మోహన్దాస్ తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణకు స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.