YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు అవినీతి చక్రవర్తి

బాబు అవినీతి చక్రవర్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. తమ అధినేత జగన్ పాదయాత్రను అడ్డుకోడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. అయినా, జగన్ ప్రజాసంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారని నాని వ్యాఖ్యానించారు. గతంలోనూ దివంగత సీఎం రాజశేఖరరెడ్డిపై కూడా తన సొంత మీడియాతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలకు 48 లక్షల ఇళ్లు నిర్మించి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. ఆయన వారసుడిగా జగన్ అధికారంలోకి వస్తే అడ్డుకోలేమన్న భయంతోనే తన భజన పత్రికలతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయించారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత గతంలో బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారనీ, నేడు కేసుల మాఫీ కోసం మోదీకి మోకరిల్లారని ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వారా చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. స్వయంగా పిల్లనిచ్చిన మామే తన నోటితో చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి ఎవరూ లేరని వెల్లడించినట్టు పేర్కొన్నారు. ‘నీ గురించి, నీ బతుకు గురించి పిల్లనిచ్చిన మామే చెప్పాడు. నువ్వొక్క వెన్నుపోటు దారుడివి. నీ అంత నీచాతి నీచమైన వ్యక్తి ఎవరూ లేరని ఎన్టీఆరే చెప్పారు ’ అని వ్యాఖ్యానించారు. మాటతప్పని, మడమతిప్పని నేతగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని, ఒక్కసారి అవకాశం ఇస్తే బతికున్నంత కాలం ముఖ్యమంత్రి ప్రజల ఆశీస్సులతో ఉంటారని అన్నారు. చనిపోయిన తర్వాత కూడా వైఎస్ కంటే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో తానేదో పెద్ద పొడుస్తానని వెళ్తే, అక్కడ జనం సరైన గుణపాఠం చెప్పారని, అయినా సిగ్గురాలేదని అన్నారు. చంద్రబాబూ నీ టైం అయ్యిపోయింది.. నీకు ఇంకా 125 రోజులే మిగులున్నాయి.. పోయే ముందు మంచి పనులు చేయడానికి ప్రయత్నించు.. ఇలాంటి చిల్లర పనులను ఇప్పటికైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఉచిత ఇసుక ద్వారా రూ.25,000 కోట్లు, నీరు-మట్టి కింద మరో రూ.45,000 కోట్లు, రాజధానిలో లక్షల కోట్ల భూములను చంద్రబాబు, టీడీపీ నేతలు స్వాహా చేశారని ఆరోపించారు. వైసీపీ నవరత్నాలు ప్రకటిస్తే అమలు చేయలేరని చంద్రబాబు విమర్శించారనీ, ఇప్పుడు అవే హామీలను తాను అమలు చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లు నరేంద్ర మోదీ సంక నాకిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. మోదీ లాంటి ప్రధాని లేడని గతంలో చంద్రబాబు కితాబు ఇచ్చిన విషయం గుర్తుచేశారు. తమ అధినేత ప్రజలను నమ్ముకున్న వ్యక్తి అని, అందుకే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాడని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.

Related Posts