YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో రైతుల కోసం మరో పథకం

ఏపీలో రైతుల కోసం మరో పథకం

వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే... సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు సాయం చేయడంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్నామని... వారిని మరింతగా ఆదుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని... ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Related Posts