యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాకు రెండో సారి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యపై స్థిరమైన అభిప్రాయం ఉంది. ఒక తరానికి నూరుశాతం నాణ్యమైన విద్యను అందిస్తే సమస్యలు ఉండవు. అందుకే ఉద్యమ సమయంలోనే మేం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని చెప్పాం. మన విద్యార్థులు చదువు పూర్తి అయ్యాక సర్టిఫికెట్లు పట్టుకొని నాలుగు రోడ్ల కూడలిలో ఉండే పరిస్థితి ఉండకూడదనేని సీఎం అభిప్రాయం. అందుకే గత ప్రభుత్వ హయాంలోనే అనేక చర్యలు తీసుకున్నాం. ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నాం. మన పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడగానే తొలుత సంక్షేమ రంగంపై దృష్టిపెట్టాం. ఆ తర్వాత వ్యవసాయ, పరిశ్రమలపై దృష్టిపెట్టాం. ఇప్పుడు విద్య, వైద్యంపై దృష్టి పెట్టాం’’ అన్నారు.