యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఊరట కలిగించే వార్తను ఇంటర్ బోర్డు వినిపించింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున ఏప్రిల్ 18న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 18న నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు