YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డగోలుగా పక్క దారి పడుతున్న రేషన్ బియ్యం

అడ్డగోలుగా పక్క దారి పడుతున్న రేషన్ బియ్యం

 అనంతపురం జిల్లాలో 3,003 చౌక ధరల దుకాణాలుండగా.. వాటి పరిధిలో 12,21,772 తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 24 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్‌ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. కార్డుదారులకు ప్రతి నెలా 18,500 టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సగటున 770 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతోంది. కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది బియ్యాన్ని నొక్కేస్తుండగా.. ఆ ప్రభావం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది.ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో క్వింటా మీద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బియ్యం నొక్కేస్తున్నా.. డీలర్లు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇదేమని ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తారని కొందరు డీలర్లు వాపోతున్నారు. 200 క్వింటాళ్ల మేర బియ్యం ఇవ్వాల్సి ఉన్నా డీలర్‌కు 196 క్వింటాళ్లు మాత్రమే ఇస్తున్నారు. నాలుగు క్వింటాళ్లు(400 కేజీలు) తక్కువగా ఇస్తున్నారని, వాటి కోసం అధికారులతో గొడవ పడి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నామని పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని ఒక డీలర్‌ చెబుతున్నాడు. ఇలా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కోత పెట్టిన బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో సర్దుబాటు చేసుకుంటున్నామని సదరు డీలర్‌ చెబుతున్నాడు. ఇలా తాను ఒక్కడినే కాదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం టెయిర్‌ వెయిట్‌(సంచి తూకం) ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో క్వింటా బియ్యాన్ని రెండు బస్తాల్లో నింపుతున్నారనీ, ఒక్కో బస్తా సంచి బరువు కిలో 100 గ్రాములు ఉంటుందన్నారు. సరఫరా అయ్యే బియ్యమే క్వింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక స్టేజ్‌–1 ద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వచ్చే బియ్యంలోనే క్వింటా మీద రెండు నుంచి మూడు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర ఉంటోందంటున్నారు. ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీలో లోడింగ్, అన్‌లోడింగ్‌కు తరుగు ఇస్తున్నారని, అదే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అన్‌లోడింగ్, లోడింగ్‌కు తరుగును ఇవ్వడం లేదంటున్నారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. తరుగు అంశాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Related Posts