ప్రణాళిక ఎలా.. (విశాఖ)
విశాఖపట్నం, డిసెంబర్ 05 నగర విస్తీర్ణం ఐదేళ్ల క్రితమే 525 చదరపు కిలోమీటర్ల నుంచి 625 చదరపు కిలోమీటర్లకు పెరిగినా.. ఆ స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులను నియమించలేదు. పర్యాటకంగా అత్యంత కీలకమైన నగరంలో పారిశుద్ధ్యం తీవ్ర సమస్యగా ఇబ్బంది పెడుతోంది. సరిపడా సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్నవారిపై ఒత్తిడి పెరుగుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్లో గతంలో ఉత్తమ ర్యాంకులు సాధించడం వెనుక పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కూడా ఉంది. త్వరలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఇంటి నుంచి తడి - పొడి చెత్తను సేకరించి, వాహనాల పైకి చేర్చాల్సిన బాధ్యత కార్మికులదే. నగరంలో కొండవాలు ప్రాంతాలు అధికంగా ఉన్నందున చెత్త తరలించేందుకు వారు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గాజువాక, మల్కాపురం, కంచరపాలెం, మాధవధార, మురళీనగర్, ఆదర్శనగర్, పెదగదిలి ప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మహా విశాఖ నగరపాలక సంస్థలో పొరుగుసేవల ద్వారా 5130 మంది కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నారు. 800 మంది శాశ్వత ఉద్యోగుల్లో చాలామంది విధులకు హాజరుకావటం లేదు. వీరిలో కొంతమంది ఇతర విభాగాల్లో అటెండర్లుగా పనిచేస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా దాదాపు మరో 700 రావటం లేదు. ఇక మిగిలినవారితోనే అధికారులు పని చేయిస్తున్నారు.జనాభా, నగర విస్తీర్ణం ప్రాతిపదికన మరో 3,400 మంది కార్మికులు అవసరమవుతారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. మరణించిన కార్మికుల స్థానంలో 125 మందిని భర్తీ చేసినప్పటికీ, ప్రస్తుతం వారు విధులకు రావడం లేదు. ఈ నియామకాల వెనుక డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు వారిని రానివ్వకుండా గుత్తేదారులకు నోటీసులు జారీ చేశారు. విచారణలో అక్రమాలపై ఆధారాలు లభించలేదని సమాచారం. కనీసం వారినైనా ఉపయోగించుకుంటే సమస్య కొంతవరకు పరిష్కారమయ్యేదని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.