అన్ని ప్రాంతాలు అభివ్రుద్ధి జరగాలి : వెంకయ్య నాయుడు
తాడేపల్లిగూడెం, డిసెంబర్ 24,
అభివృద్ధి వికేంద్రీకరణ (డెవలప్మెంట్ డీ సెంట్రలైజేషన్)పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాల కారణంగానే ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివాలరించాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కేవలం జిల్లా ప్రాంతాలకే పరిమితం కాకూడదని.. గ్రామీణ ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.అందులో భాగంగానే తాడేపల్లి గూడెంలో నిట్ సంస్థను నెలకొల్పినట్లు ఉప రాష్ట్రపతి వెల్లడించారు. నిట్ను తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే తాడేపల్లి గూడెంలో నిట్ ఏర్పాటు చేసినట్లు వెంకయ్య చెప్పారు.అయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న వెంకయ్య.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న మూడు రాజధానుల వ్యవహారంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అది అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయమని.. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. . డెవలప్మెంట్ డీ సెంట్రలైజేషన్ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసి వలసలను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.