పార్టీ అభివృద్ధిపైనే రెండో దృష్టి
హైద్రాబాద్, డిసెంబర్ 26,
ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ఊహించని విజయంతో కేసీఆర్ మళ్లీ తెలంగాణ గద్దెనెక్కారు. రెండోసారి కేసీఆర్ సీఎం అయి, ఏడాది గడిచింది. అయితే, ఈ ఏడాది కేసీఆర్ పాలన ఎలా ఉంది? ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు?..కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. పాలనలో కేసీఆర్ దూసుకుపోతున్నారని సొంత పార్టీ నేతలు చెబుతుంటే... ప్రతిపక్షాలు మాత్రం పాలన పాతాళంలోకి వెళ్లిందని ధ్వజమెత్తుతున్నారు. రెండో సారి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనపై, పార్టీ బలోపేతంపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ సమీక్షలన్ని ఆయనకే అప్పజెప్పారు. ఇలా కేటీఆర్ పార్టీపై పూర్తి నజర్ పెట్టారు. అయితే మొదటి సారి ప్రభుత్వం వచ్చినప్పుడు.. పార్టీ లో కనిపించిన జోష్ ఇప్పుడు కనిపించటం లేదన్న వాదన వినిపిస్తోంది.ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. అయితే ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి... ఢిల్లీని శాసించాలనుకున్న కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా కుమార్తే కవిత నిజామాబాద్లో ఓటమిపాలవ్వడంతో కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందనే ప్రచారం జరిగింది. ఇక ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని టీఆర్ఎస్ కవర్ చేసుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలవటంతో హుజూర్ నగర్కు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. హుజూర్ నగర్ ఎన్నికల తరువాత కేసీఆర్ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని ఆశవహులంతా భావించారు. ఇద్దరు ముగ్గురికి మినహా పదవుల పంపకం పూర్తి కాలేదు. ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టే టీఆర్ఎస్ నేతలకు... ఈ ఎడాది కాస్తా ఇబ్బందికర సరిస్థితులు ఎదురైయ్యాయి. ఎన్నికలు... గెలుపు, ఓటములతో బీజీగా ఉన్న నేతలకు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె షాక్ తగిలింది. సొంత నియోజకవర్గాల్లో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం చేయలేక టీఆర్ఎస్ నేతలు మౌనం వహించాల్సి వచ్చింది. ఇక కేసీఆర్ సింగిల్ బాస్ గా కొనసాగుతున్న టీఆర్ఎస్లో కొన్ని గొంతులు పెకిలి.. పార్టీ లోని అంతర్గత వాతావరణానికి అద్దం పట్టాయి. పార్టీ కి నేను ఓనర్ను అంటూ మంత్రి ఈటెల చేసిన కామెంట్స్ పార్టీని కుదిపేశాయి. మరో వైపు ఇక దిశ సంఘటన కూడా టీఆర్ఎస్ పార్టీ భిన్న వాదనలకు వేదికైంది.పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చినా...... ఇప్పటి వరకూ నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. ఇక ఈ ఏడాదిలో పార్టీ పదవుల నియామకం ఉంటుందని భావించిన నేతలకు నిరాశే మిగిలింది. మరోవైపు, గ్రూప్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్ల కోసం వారు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రానున్న మున్సిపాల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో సత్తాచాటి పూర్తి పాలనపై దృష్టి పెట్టాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.