YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

తిరుప్పావై 26వ పాశురం*

తిరుప్పావై 26వ పాశురం*

తిరుప్పావై 26వ పాశురం*
ఓంశ్రీమాత్రే నమః
అద్వైత చైతన్య జాగృతి
*26.పాశురం*
      *మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;*
        *మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;*
        *ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన* 
        *పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,*
        *శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,*
        *కోలవిళక్కై, కోడియే, వితానమే,*
        *ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్!!*
*భావం*
ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను.  ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి.  ఆశ్రిత వ్యామోహమే స్వరూపముగా కలిగిన ఇంద్రనీలమణి వంటి శరీరముకలవాడా! ఓ వటపత్రశాయీ! మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులున్నూ యీ స్నాన వ్రతాన్ని ఆచరించియున్నారు. ఈ వ్రతానికవసరమగు పరికరములను నిన్నర్ధింపగా వచ్చాము. దయచేసి ఆలకింపుము. భూమండలమంతయు వణుకు కల్గించునట్లు ద్వనించే పాలవంటి తెల్లనైన శఖంములు  సరిగా నీ పాంచజన్యము వంటివి కావలెను. అతిపెద్దవైన పఱవంటి వాద్యములు కావలెను. మృదుమధురమైన కంఠములతో మంగళ గానాలను పాడే భాగవతులను కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తం మంగళదీపము కావాలి. వ్రాత సంకేతములుగా అనేక చాందినీలు కావాలి. లోకలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని, ఒక లేత మఱ్ఱి యాకుమీద పరుండిన నీకు చేతకానిదేమున్నది స్వామీ! కరుణించి మా వ్రతము సాంగోపాంగముగ పూర్తీయగునట్లు మంగళాశాసనము చేసి వీనిని ప్రసాదింపుము. 
*అవతారిక
భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు. మరొక వ్రతములను ఆచరింపరాదు. మార్గశీర్ష స్నాన వ్రతము, వ్రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్ల శ్రేష్ఠమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్షస్నానము. ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాశురములో కోరుచున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవదనుభూతికి కావలసిన సామగ్రిని కోరుచున్నారు.        
ఉపాయము, ఫలము _ రెండును భగవానుడే అని నమ్మిన గోపికలు వానిని సుత్తించి, కీర్తించి ప్రసన్నుణ్ణి చేసుకొన్నారు. వ్రేపల్లెలోని పెద్దల కోరికమేరకు యీ మార్గ శీర్షవ్రతాన్ని వర్షాలు కురియటంకోసమే గోపికలు చేస్తున్నారు. పెద్దలకు ప్రతిఫలం వర్షాలు కురియటం. కానీ గోపికల వ్రతఫలం మాత్రం  శ్రీకృష్ణ సమాగమమే! మార్గశీర్ష స్నానమనగా __ నిరంతర శ్రీకృష్ణ సంశ్లేష ఆనందంలో మునకలు వేయటమే అని అర్ధం ఇలా చేసే యీ వ్రతానికి కావలసిన పరికరాలను గోపికలు యీ (ప్రాశురంలో) కోరుతున్నారు.  
*అమృతవర్షిణి _ అదితాళము
    ప....    ఆశ్రితవత్సల ! నీల శరీరా!
        ఆశ్రితులమురా! కృపజేయుమురా!
    అ..ప..    ఆశ్రయించితిమి వటపత్రశాయి!
        ఆశ్రితర్డాముల నవధరించరా!

1.    చ..    లోకములదరగ ఘోషించేడి నీ 
        శంఖపుసరి వాద్యముల నీయరా!
        మాకోసగిన ఘన వాద్య విశేషము        
        గైకొని మావ్రత మాచరించెదము

2.    చ...    మంగళముల నాలపించువారిని
        మంగళమౌ దీపమ్ము, ద్వజమ్మును
        మంగళకరమౌ వితానమ్మును
        సంగితితో మాకోసగు దేవరా
*శ్రీ కృష్ణుడి సామర్థ్యం*
*ఆండాళ్ తిరువడిగలే శరణం* 
ఈ రోజు మనవాళ్ళంతా శ్రీ కృష్ణుడి సామర్థ్యాన్ని తెలుపుతూ వారికి కావలసిన వ్రత పరికరాలను సమకూర్చుకుంటున్నారు. తిరుప్పావైలో ఆండాళ్ తల్లి ప్రమాణాలను తెలుపుతూ వ్రతాన్ని ఆచరించింది. అందులో మొదటగా *"శెయ్యాదన శెయ్యోం"* మన పూర్వులు చేయనివి చెయ్య కూడదు. ఈ మధ్యకాలంలో మనం సౌకర్యాలకని తెచ్చి పెట్టుకున్నవి మన ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నాయో అనుభవిస్తున్నవారికి తెలుసు. ఇదివరకు ఇవన్నీ లేని నాడు హాయిగా బ్రతి కేవారు మన పూర్వులు. సౌకర్యం కోసం భౌతికమైనవి చెయ్యవచ్చు అవి మన స్వరూపాన్ని పాడు చేయనంత వరకు, ఇది గుర్తుంచుకోవాలి.  ఆత్మోజ్జీవన కోసం మాత్రం మా పూర్వులు ఆచరించనివి మేం ఆచరించం అని చెప్పింది. ఆపై *"మేలైయార్ శేయ్-వనగళ్"*  ఏవి మన పూర్వులు ఆచరించారో  మన శ్రేయస్సు కోసం అవే ఆచరించాలి. మనం చేసేప్పుడు ఎదుటివారు ఏమైనా అంటే లేదా అడ్డుపడినా వారిని ఎదురు చెప్పకుండా  *"నానే తాన్ ఆయిడుగ"* నేనే అంగీకరిస్తా అంటూ వినయంతో లక్ష్యంవైపు చెదరని స్థితిని ఆర్జించడం. ఈ మూడు సూత్రాలతో ఆచరించింది ఆండాళ్ తల్లి. ఈ రోజు ఆండాళ్ తల్లి *"మేలైయార్ శేయ్-వనగళ్"* సూత్రాన్ని చెబుతుంది. పెద్దలు అన్నప్పుడు, కొన్ని అనాచారాలు కూడా ఉండి ఉండవచ్చు. అప్పుడు పెద్దల ఆచరణ ప్రమాణ యోగ్యం కాక పోవచ్చు. వేదంలో ఇవి తగును, ఇవి తగవు అనే నిర్ణయం చేయబడి ఉంది. వీటికి విరుద్ధంగా లేని ఆచరణని మనం స్వీకరించవచ్చు. ఇది ఒక నిరూపణ.  స్వామిలోని ప్రేమను కనిపెట్టి *“మాలే మణివణ్ణా”* ఓ మణి మాణిక్యమా అంటూ పిలుస్తున్నారు. అయితే తన ప్రేమను కనిప్పెట్టేసారు, ఇక ఎక్కడ లోంగాల్సొస్తుందేమోనని స్వామి నాకు ఈ పేరు ఏం కొత్త కాదు, మా అమ్మ యశోదమ్మ  కూడా ఇలాగే పిలిచేది. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి. *“మార్-గరి నీరాడువాన్”* మార్గశీర్ష స్నానం చేయాటానికి మేం వచ్చామయా అని చెప్పారు.  అయితే ఎవరు చెబితే చేస్తున్నారు అని అడిగాడు స్వామి. *“మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన”* మా పెద్దలు ఆచరించినది కాబట్టి మేం చేస్తున్నాం. దృఢమైన ప్రమాణం పట్టుకున్నారు.  అందులోనూ గోపికలు ఆచరించినది కదా, ఇక ప్రశ్నే లేదు. స్వామికి చాలా సంతోషం వేసింది తన ఆర్తితో వీళ్ళనంతా అట్టే చూస్తూ ఉండిపోయాడు. *“కేట్టియేల్”* వినబడుతుందా మేం అడిగినది అని అడిగారు.  అయితే మీకు ఏం కావాలో ఒక్కొక్కటి చెప్పండి అని అడిగాడు స్వామి, వీళ్ళు ఒక్కొటి చెప్పడం ప్రారంభించారు. *“ఞాలత్తై యెల్లాం”* భూమినంతా  *“నడుంగ”* వణికించేట్టుగా *“మురల్వన”* ద్వని చేసేట్టి *“పాలన్న వణ్ణత్తు”* పాలవలే తెల్లగా స్వచ్చమైన కాంతికల్గిన, *“ఉన్-పాంచజన్నియమే పోల్వన”*  నీ పాంచజన్యాన్ని పోలిన  *“శంగంగళ్”* శంఖాలు కావాలి అని అడిగారు. నీ పాంచజన్యాన్ని పోలిన  అని చెబుతున్నారు ఎందుకంటే, భగవంతునికి శంఖం, చక్రం ఈ అసాదారణ ఆయుదాలు ఉంటాయికదా ఈ మద్య కాలంలో ఎవరికి పడితే వారికి పెట్టేస్తున్నారు. అది చాలా తప్పు. శ్రీకృష్ణుడి కి సన్నిహితుడుగా ఉండే వాడు శ్రీ మాలికుడు, అయితే శ్రీకృష్ణుడి పేరుచెప్పుకొని కొంచం అల్లరి చిల్లరగా చేసేవాడు. కొంత కాలం అయ్యాక కృష్ణా నీ వద్ద ఉన్న సుదర్శణ చక్రం కావాలయ్యా అనిడిగాడట. ఇది ఇతరులకు లోంగి ఉండదు అని చెప్పి చూసాడు,  ఇక వినక పోయేసరికి ఇచ్చాడు, పాపం తనకు తెలియకుండానే తన తలను నరుక్కున్నాడు శ్రీమాలికుడు. శ్రీవెంకటాచలపతి చరిత్రలో ఒక కథ ఉంది. తిరుమల కొండపై కుమారస్వామి తపస్సుని అనుగ్రహించటానికి శ్రీనివాసుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడికి పరమ శివుడు కూడా వేంచేసాడు. అయితే పరమ శివుడికి  శ్రీనివాసుడికి ఏర్పడ్డ మైత్రితో, పరమ శివుడు అడిగాడట స్వామీ నేను ఈ కొండపై ఉంటాను అని, అయితే స్వామి ఈ ఆదిశేషుడిపై నీవు ఉండతగవు అని,  ఆదిశేషుడి తోక స్థానం కపిల తీర్థం వద్దకు పంపివేసాడు. అయితే ఆ చక్రాన్ని ఒకసారి అడిగిచూసాడట, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేదికాదు, ఎవ్వరి మాట వినవు అని చెప్పాడట.  శంఖ చక్రాలు ఉండేవి కేవలం శ్రీహరికి మాత్రమే.
ఆనాడు యుద్దరంగంలో ఊదినప్పుడు పాండవులకు ఆనందంవేసింది, కాని ధృతరాష్ట్ర సంతానానికి గుండెలు పగిలి పోయాయి, ఆ పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అని అడుగుతున్నారు. సాయుజ్యాన్ని కాంక్షించినప్పుడు భగవంతుడి సాన్నిహిత్యం కావాలికదా, అందుకే మొట్ట మొదట ప్రణవార్థం ప్రకాశించవలెనని కోరుతున్నారు. శంఖాన్ని మనవాళ్ళు ఓంకారంతో పోలుస్తుంటారు. ఆ ఓంకారం ఎలా ఉంటుంది అంటే దాన్ని అనుష్టించినప్పుడు మన దైన ఈ శరీరమనే భూమి ఒక్కసారి వణుకుతుంది,  ఇందులో ఉండే అపార్థములు తొలగుతాయి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఓంకారం ఏంచెబుతుందంటే  అకారమైన పరమాత్మకే మకారమైన నేను చెందినవాణ్ణిగా అన్ని అవస్తలయందు వాడి సేవ చేయవలె.  ఇదే శేశత్వాన్ని తెలుపుతుంది. తన పాంచజన్యాన్ని పోలిన శంఖాలు అడుగుతున్నారు, ఇది ఇవ్వడం కష్టం అని అను కున్నాడు స్వామి, సరేలే ఇంకా ఏమేమి కావాలో ఒకేసారి చెప్పండి అని కృష్ణుడు అడిగాడు.  మాకు ఇంకా *“పోయ్ ప్పాడుడైయనవే శాలప్పెరుం పఱైయే”* శక్తివంతమైన చాలా పెద్ద వాయిద్యం కావాలి, ఇంకా *“పల్లాండిశైప్పారే”* పల్లాండు పాడేవారు కావాలి, ఇంకా *“కోలవిళక్కే”* ఆరని నిలువు దీపం కావాలి. గోష్టితో వెళ్ళేప్పుడు మంగళకరంగా ఒక దీపం ఉండాలి కదా అందుకు, ఇంకా మేం ఉన్నట్లు తెలిసేలా *“కొడియే”* ద్వజం కావాలి, ఇంకా *“వితానమే”* మంచు పడకుండా గొడుగు కావాలి అని అడిగారు. మీరు అడిగినవి ఒక్కోటి ఇవ్వడం కష్టం అని చెప్పేసాడు శ్రీకృష్ణుడు.  ఎమయ్యా నీవెవరవో మాకు తెలియదని అనుకున్నావా, *“ఆలిన్-ఇలైయాయ్”* అన్నిలోకాలను నీ పొట్టలో పెట్టుకొని అప్పుడప్పుడే వికసించిన వటదలం పై శయనించగలిగావు, తిరిగి ఇన్ని లోకాలను బయటికి తేగలిగావు, మేం అడిగినవి ఇవ్వలేవా నీ సామర్థ్యం ఏంటో మాకు తెలుసు, నీవు అనుకుంటే జరగనిదిలేదు, నీవు వద్దు అనుకుంటే జరిగేది ఏమిలేదు అంతా  *“యరుళ్”* నీ దయ అని స్వామిని కోరారు.  ఇక వీళ్ళ కు ఇవ్వక తప్పదు అని ఇది వరకు ఊర్లో కోవెలలో ఉన్న శంఖాన్ని ఒకటి తెప్పించి ఇచ్చాడు, తన దగ్గర ఉన్న కొంబుబూర ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళు ఆనందించారు. ఇక వాయిద్యం తను వెన్న తినేప్పుడు చేసే ఘట నృత్యం అప్పుడు వాడే వాయిద్యాన్ని ఇచ్చాడు. ఇక పల్లాండుకు, రాబోయే కాలంలో రామానుజ సంపర్కంచే ఏర్పడే భక్త గోష్టికి మంగళం పాడిన నమ్మాళ్వార్ ను పంపాడు. ఇక ఆరని దీపం అడిగారు కదా అమ్మను వీళ్ళతో పంపాడు, ఇక ద్వజానికి గుర్తుగా గరుత్మంతుడిని పంపాడు. గొడుగుగా ఆదిశేశుడు వెళ్ళడు కనక, తాను దరించి విడిచిన శేషవస్త్రం ఒకటి ఇచ్చాడు, స్వామి సంబంధం కలవి కాభట్టి వీళ్ళకు అదే చాలు
*తిరుప్పావై  26వ పాశురము/ అనువాద పద్యం* 
సీ. మా మాటను వినుమా మామీద దయలేద
      భక్త వత్సలుడని వచ్చినాము
మార్గళి స్నానంబు మానోము చేయగా
        మాకు కావలసిన మాన్యుడవని
మహేంద్ర మణిమూర్తి మహిమలు తెలియక
      ఆలకింతు వనుచు యడిగినాము
పాల వన్నియ నున్న పాంచజన్యపు ద్వని
          ధరణి యందున నిండి దద్దరిల్లె
ప్రబలమైన బహుళ పరవాద్య పటహంబ
          ను గ్రహింతు వంచును నోము మెచ్చి
ఆశ్రయించిన వార్కి యాశ్రయ మిచ్చెడు
      ఆశ్రిత వాత్సల్యుడంచు తలచి
వ్యామోహవంతులై ధ్యానమంతయు నిల్పి
        వచ్చు గోపిక లెల్ల వదల లేక!!
తే.గీ. సర్వ జగములు నీవల్ల సాగుననుచు
పార తంత్రపు జ్ఞానులై భక్తితోడ
వ్రతము సల్పిరి దాసులై పద్మనాభ
యనుచు శేషత్వ జ్ఞానులై యరిగినారు
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము 
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!

Related Posts