YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు!!

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు!!

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు ఏనుగుపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడుతూ 1984వ సంవత్సరం నుండి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను శ్రీకోదండరామాలయానికి తీసుకెళుతున్నట్టు తెలిపారు. సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు ప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. మార్చి 27న మంగళవారం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు రామాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరుగనుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Related Posts