స్పందన ఆర్జీలపై ప్రత్యేక దృష్టి
కర్నూలు, ఫిబ్రవరి 24
స్పందన అర్జీల పెండింగ్ సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి, ట్రైనీ కలెక్టర్ విదేకరే, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్, డిఆర్వో పుల్లయ్య , డిఎస్ ఓ పద్మశ్రీ , జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఎ ఎపిడి శ్రీధర్ రెడ్డి తదితరులు జిల్లా నలుమూలల ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. స్పందనలో వచ్చిన అర్జీల తిరస్కారం జీరో కావాలన్నారు. సీఎంవో ఆఫీస్ నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులుకు కలదన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో వారం రోజుల్లో పరిష్కరించేవి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేవి, ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. సమస్యను తూ తూ మంత్రంగా పరిష్కరించకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తును చిన్న చిన్న కారణాలతో తిరస్కరించకుండా సమస్య పరిష్కారంపై శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను సులభంగా తిరస్కరించడం వల్ల బాధితుల సమస్యలు బాధలు తొలగిపోవని పరిష్కరించినపుడే సంబంధిత బాధితులకు న్యాయం చేసిన వారమవుతాం అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు .