మీడియా కు అంతరాయం కలిగించొద్దు... సీఎస్ లకు కేంద్రం సూచన
హైదరాబాద్, మార్చి 24
కొవిడ్-19 విజృంభన నేపథ్యంలో ప్రసార మాధ్యమాల సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా నిర్మూలనకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయని, అయితే అదే సమయంలో వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం ఆ ప్రకటనలో అభిప్రాయపడింది. టీవీ చానెళ్లు, న్యూస్ ఏజెన్సీలు, టెలీపోర్ట్ ఆపరేటర్లు, డీఎస్ఎన్జీలు, డీటీహెచ్లు, ఎంఎస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, ఎఫ్ఎం రేడియోలు, కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర సమాచార శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది. ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతోపాటు కరోనా నిర్మూలన కోసం ప్రజలకు అవసరమైన ముఖ్య సందేశాలను ప్రసారం చేయాలని సూచించింది. అదే సమయంలో తప్పుడు వార్తలు, ప్రజలను భయాందోళనలకు గురిచేసే వార్తలకు దూరంగా ఉండాలని కోరింది.కరోనాపై ప్రజలను అలర్ట్ చేయడంలో ప్రసార మాధ్యమాలది కీలకపాత్ర అయినందున ఆయా నెట్వర్క్లకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, యూటీల సీఎస్లను కేంద్రం కోరింది. మీడియా ప్రతినిధుల రాకపోకలకు ఆటంకం కలిగకుండా చర్యలు తీసుకోవాలని.. వారి వాహనాలకు ఇంధనం కొరత రాకుండా చూడాలని.. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్లు, ఇతర న్యూస్ నెట్వర్క్ కార్యాలయాలకు విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సీఎస్లకు కేంద్రం సూచించింది.