అద్దె కోసం వేధించకండి : కేజ్రీవాల్ విన్నపం
న్యూఢిల్లీ,మార్చి 26
కరోనా ధాటికి దేశం మొత్తం విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. దేశమంతా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ల ప్రభావం పేద, మధ్య తరగతి వారిపై బాగా పడుతోంది. ఇక రోజువారి కూలీపై పని చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వీరికి పని చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంటుంది. అందువల్ల అలాంటి వారి గురించి దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు దిల్లీలో ఇళ్ళు అద్దెకు ఇచ్చిన యజమానులకు సీఎం కేజ్రీవాల్ ఓ విజ్ఞప్తి చేశారు. యజమానులు ఇంటి అద్దె కోసం రోజువారీ వేతనంపై పని చేసేవారిని వేధించవద్దని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కిరాయికి ఉండే వారి నుంచి ఓనర్లు బలవంతంగా అద్దె వసూలు చేయొద్దని ఆయన కోరారు. కరోనా వల్ల ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యమైనా ఓనర్లు సహకరించాలని సూచించారు. అద్దె కోసం వారిని బలవంత పెట్టవద్దని ఆయన సూచించారు. కనీసం ఇంటి అద్దెను వాయిదాల పద్ధతిలో వసూలు చేసుకొని రోజువారి వేతన జీవులను ఆదుకోవాలని కేజ్రీవాల్ కోరారు.