మన్యంపై కరోనా ఎఫెక్ట్ (విశాఖ)
పాడేరు, ఏప్రిల్ 08 (న్యూస్ పల్స్): మన్యంలో నూటికి తొంభై శాతం మంది వ్యవసాయ, వాణిజ్య పంటలపై ఆధారపడి జీవిస్తున్నవారే. వీరు పండించే పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఆయా వాణిజ్య పంటల ద్వారా సుస్థిర ఆదాయం రైతులకు సమకూరుతోంది. నేడు ఆ గిరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. పంట చేతికంది జోరుగా అమ్మకాలు చేసుకోవాల్సిన సమయంలో లాక్డౌన్ అమలులో రావడంతో ఎక్కడ నిల్వలు అక్కడ పేరుకుపోయాయి. రంగు, రుచి, నాణ్యతలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాఫీ, మిరియాలు, పసుపును వారపు సంతల ద్వారా సేకరించిన సరకును జాతీయస్థాయి మార్కెట్కు తరలిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా ఈ క్రయ, విక్రయాలన్నీ రద్దు కావడంతో మన్యం రైతుకు దిక్కుతోచడం లేదు. కాఫీకి సంబంధించి మార్కెటింగ్ సీజన్ దాదాపుగా ముగిసింది. మిరియాలు, పసుపు, జీడిపప్పు, చింతపండు ఇప్పుడిప్పుడే వారపు సంతల్లో మార్కెటింగ్ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ అమలులోకి రావడం.. వాణిజ్యం మొత్తం బంద్ కావడంతో రైతుల ఆదాయంపై కొలుకోలేని దెబ్బ తగిలింది. వారపు సంతల నుంచి సేకరించిన పంటలను విజయవాడ, బెంగళూరు, ముంబై, కోల్కతా వంటి జాతీయ మార్కెట్లకు తరలిస్తుంటారు. దేశ వ్యాప్తంగా మార్కెటింగ్, రవాణా వ్యవస్థ స్తంభించడంతో మన్యం ఉత్పత్తులు ఏజెన్సీ దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పసుపు సాగు ఈ ఏడాది మంచి దిగుబడి ఉన్నా వారపు సంతలు రద్దు కావడంతో జాతీయ మార్కెటింగ్ ప్రభావంతో ధర తగ్గే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపండును చెట్ల నుంచి దించేస్తున్నారు. నిల్వ చేసుకోవడానికి సరియైన గోదాములు లేక పురుగులు పట్టే ప్రమాదముంది. మార్కెటింగ్ తిరిగి మొదలయ్యే వరకు ఏలా నిల్వ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గత ఏడాది వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జీడి పంట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఏడాది కొద్దో గొప్పొ చేతికొచ్చిన పంటను అమ్ముదామంటే వీలు లేకుండా పోయింది. మిరియాలు గత ఏడాది కేజీ రూ. 350 వరకు ధర ఎగబాకింది. ఈ ఏడాది ధర తక్కువగా ఉన్నా ఏదోలా సొమ్ము చేసుకుందామన్నా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రైతులకు మింగుడు పడడం లేదు. కాఫీ రైతులకు బయానా మాత్రమే ముట్టింది. జాతీయ మార్కెటింగ్లో ధరల ఆధారంగా వర్తకులు మిగులు సొమ్ములు రైతులకు ఇస్తుంటారు. ఈ మార్కెట కూడా నిలిచిపోవడంతో మిగులు సొమ్ముపై రైతులు ఆందోళన చెందుతున్నారు.