తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శం: జగదీశ్రెడ్డి
యాదాద్రి భువనగిరి మే 27
తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని రాష్ట్ర మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మంత్రి నేడు వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల సరఫరా, నియంత్రిత వ్యవసాయ సంసిద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతుల ఉత్పత్తులకు విలువ పెరిగేలా ప్రభుత్వం నియంత్రిత విధానం తెచ్చిందన్నారు. రైతు పండించిన కంది పంటలో ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందన్నారు. నియంత్రిత వ్యవసాయంలో రైతులను సంఘటిత పరచడం మొదటి లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైతాంగాన్ని సంఘటితం చేసి లాభాలు పొందే విధంగా సీఎం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, నీళ్లు, ఆర్థిక చేయూత, ఎరువులు, విత్తనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కానీ మార్కెట్లో రైతులు పండించిన పంటలకు ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదన్నారు. కాబట్టే రైతులు నష్టపోతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ రైతులను ఐక్యం చేయడానికి నియంత్రిత విధానాన్ని ముందుకు తెచ్చారన్నారు. నూతన వ్యవసాయ సాగు విధానాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నరన్నారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం పరిపాటిగా పెట్టుకుందన్నారు. నియంత్రిత విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులు రైతు వ్యతిరేకులుగా మారారన్నారు