YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓనీతి కథ,

దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓనీతి కథ,


దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఓనీతి కథ,
ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్టా సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు.  ప్రజలంటే చాలావాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం  కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. 
ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు.  “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..”భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి”  అన్నాడు. భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు. ఆయన చివరకు ఇలా అన్నాడు “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై,  భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని,   మరుసటిరోజు తన నగరంలో దండోరా వేయించాడు."రేపు అందరు కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని, అక్కడ మీకందరికి కూడా ఆ భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఇది రాజుగారి ఆజ్ఞ!” రెండవ రోజు రాజు తన ప్రజలందరిని తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ ఉండగా కొండ దారిలో ఒకచోట రాగి నాణేల నిధి కనిపించింది. ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు.      అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి, "అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు,  ఎందుకంటే.. మీరు అందరూ  గవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు.  కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు.   వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు 'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని!   రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక అందరికి ఒకచోట వెండి నాణేల కొండ నిధి కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు.  వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు, భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు కదా!’ అనిపించింది. ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత అందరికి విచిత్రంగా బంగారపు నాణేల నిధి కనిపించింది.  ప్రజలలో ఇక మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరుగెత్తడం మొదలుపెట్టారు.   వాళ్ళు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.  ఇంక కేవలం రాజు, రాణి మిగిలారు. రాజుగారు రాణితో అన్నాడు. “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగవంతుడి నిజ దర్శనం లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!”   నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది. వారిద్దరు ముందుకు సాగారు.  కొంతదూరం వెళ్లాక  రాణికి, రాజుకు ఏడురంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది. ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది. ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవటం ప్రారంభించి, "మీరు త్వరగా  వెళ్ళిరండి, నేను మీరు వచ్చేలోపు వీటన్నింటిని పోగుచేసి ఉంచుతాను" అంది.అదిచూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు. నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు.    రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు."ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు?  నేను ఎప్పటి నుంచో.. ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నాను.”  రాజుగారు చాలా సిగ్గుతో, భగవంతుని ముందు తల దించుకున్నాడు.  ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు.“ఓ రాజా, ఎవరైన సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికి నేను లభించను, కనిపించను! వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు!”  ఈ కథ యొక్క సారాంశం : ఎవరైన సరే తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతున్ని శరణు వేడుతారో, ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి, ఇష్టంతో భక్తితో భగవంతున్ని కొలుస్తారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.మన తిరుమల శ్రీనివాసున్ని కలియుగ ప్రత్యక్ష దైవం అని పెద్దలు ఊరికే అనలేదు స్వామి, స్వామి వారి మహిమలు వర్నణాతీతం, ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు ఇక ఆయనే అన్ని చూసుకుంటాడు. ఇది మా అనుభవం నేర్పిన పాఠం, మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోంటే చాలు. 

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts