YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

*శాకంబరి* ...

*శాకంబరి* ...

*శాకంబరి* ...
మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది.
అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. 
అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు.
శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. 
శాకంబరీ దేవి ఉత్సవం సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు  పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. 
ఇందుకు సంబందించిన పురాణ గాధ తెలుసుకుందాం ...
వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు.  దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తి హీనులైపోయారు. నదీ నదాలు ఎండి పోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. 
ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవి కరుణతో “శతాక్షి” గా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని  చూసి అమ్మవారి ఒక  కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి  పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి, అమ్మవారు అమితమైన దయతో  శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్శనమిచ్చింది.  ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. 
ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం.
పార్వతీ దేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులతో దుర్గమాసురునితో, రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించింది...
*శ్రీ మాత్రే నమః*????

Related Posts