కడప జూలై 4
భారత స్వాతంత్ర్య చరిత్రలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అందరికీ స్పూర్తి దాయకమని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. రఘునాథ్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలు నందు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమంలో జిల్లా రెవెన్యూ అధికారి ముఖ్యఅతిథిగా పాల్గొని తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అల్లూరి సీతారామరాజు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యం లో మన్యం ప్రజల హక్కుల కోసం, భూమి హక్కు కోసం, అటవీ సంపద ఉత్పత్తుల హక్కు కోసం పోరాటాలతో మొదలై ఒక స్వాతంత్ర సమరయోధుడు గా మొట్టమొదటగా భారత చరిత్రలో కనబడ్డారని అన్నారు. ఎటువంటి రవాణా సౌకర్యం లేని సమయంలో అన్ని ప్రాంతాలలో తిరిగి భారత స్వాతంత్రోద్యమంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలా తీసుకొని వెళ్ళాలని ఆలోచించిన వ్యక్తులలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకరన్నారు. స్వాతంత్ర్య పోరాట యోధులలో ఆయనకు ప్రత్యేకమైన అధ్యాయం ఉందని, దేశ స్వాతంత్రం కోసం సాహసోపేతమైన పోరాటాలు చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయ ప్రకాష్, అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.