భద్రాద్రి జూలై 7,
ఓపక్క తెలంగాణా ప్రభుత్వం హరితహారం ను ప్రతిష్టాత్మకంగా చేపట్టి అడుగులు వేస్తుంటే మరోపక్క అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అడవులు మాయమవుతున్నాయి. విలువైన వృక్షాలు మాయమవుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.ఇంటి దొంగల సాయం లేకుండా ఇంత పెద్ద పెద్ద వృక్షాలు తరలిపోతాయా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో కలప స్మగ్లర్లు రోజురోజుకూ పెచ్చు మీరిపోతున్నారు. విలువైన మారుజాతి చెట్లను నరికివేసి కలపను రాత్రికిరాత్రి సరిహద్దులు దాటించేస్తున్నారు. అశ్వారావుపేట రేంజ్ లోని నారాయణ పురం బీట్ పరిధిలో గాడ్రాల అటవీప్రాంతంలో స్మగ్లర్లు విలువైన నారవేప చెట్లను నరికివేసి కలప తరలించేశారు.ఇంటి దొంగల హస్తముందంటూ బలమైన వాదన వినిపిస్తున్నప్పటికీ అధికారుల మాత్రం నామమాత్రంగా విచారణ చేస్తూ చేతులు దులుపు కుంటున్నారు. ఇదే మండలంలో అటవీభూములు భూస్వాములకు ధారాదత్తం చేసిన ఘటన, అటవీ కార్యాలయంలో కలప మాయం చేసిన ఘటన మరువక ముందే విలువైన వృక్షాలు మాయం చేయడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోకూడా ఈ మండలంలో నందీపాడు పరిధిలో ఎంతో విలువైన మారుజాతి చెట్లను స్మగ్లర్లు నరికివేసిన ఘటనలో కొందరిపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడంతో కలప స్మగ్లర్లు అడవులను మింగేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప స్మగ్లర్ల ఆట కట్టించాలని, ఇంటి దొంగల చేతివాటం పై సమగ్రంగా విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.