వార్తలు తెలంగాణ
ఆన్ లైన్ టిక్కెటింగ్ అమలుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. సినిమా ధియేటర్ లలో సినిమా టిక్కెట్ ల విక్రయాల లో పారదర్శకత పాటించడం కోసం ఆన్ లైన్ టిక్కెట్ విధానం అమలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గురువారం సచివాలయం లోని తన చాంబర్ లో ఆన్ లైన్ సినిమా టిక్కెటింగ్ విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఫ్.డీ.సీ చైర్మన్ రాంమోహన్ రావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, సమాచారశాఖా కమిషనర్, పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, రెవిన్యూ ( వాణిజ్య పన్నులు ) ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, న్యాయశాఖ సెక్రటరీ నిరంజన్ రావు, జీ.హెచ్.ఎం.సీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి లు పాల్గొన్నారు. వారం రోజుల లో సమావేశం నిర్వహించి ఆన్ లైన్ టిక్కెటింగ్ అమలుకు చేపట్టవలసిన చర్యలను గుర్తించాలని సూచించారు. ప్రస్తుతం సినిమా టిక్కెట్ ధరలను ఇష్టానుసారంగా వసూలు చేయడం, ధియేటర్ లలో విక్రయిస్తున్న తినుబండారాలకు అధిక ధరలు వసూలు చేస్తున్న కారణంగా సామాన్యుడు కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్ళలేని పరిస్తితి ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రైవేటు ఆన్ లైన్ వెబ్ సైట్ లు 20 నుండి 40 రూపాయల వరకు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్న కారణంగా ప్రేక్షకులపై భారం పడుతుందని ఆయన అన్నారు. ఒకొక్క ప్రదర్శనకు 50 శాతం టికెట్లు మాత్రమే ఆన్ లైన్ లో విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్దంగా అదనపు టికెట్లు విక్రయిస్తున్నారని మంత్రి వివరించారు. జీ.ఎస్.టీ విధానంలో 100 రూపాయల కంటే తక్కువ టిక్కెట్ ల పై 18 శాతం, 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటె 28 శాతం పన్ను వసూలు చేయబడుతున్నదని, ఆన్ లైన్ విధానంలో 1.98 శాతంతో ఎలాంటి అదనపు వసూలు ఉండదు అని ఆయన అన్నారు. అంతేకాకుండా సినిమా ధియేటర్ లలోని క్యాంటీన్లలో తినుబండారాల ధరలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా కాకుండా ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సినిమా ధియేటర్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆన్ లైన్ టికెటింగ్ పై మoత్రి తలసాని సమీక్ష