న్యూఢిల్లీ, ఆగస్టు 8,
ఎన్డీఏ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిపాకి క్యాబినెట్ విస్తరణ చేపట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీ లోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేంద్ర క్యాబినెట్లో 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో 57 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. అంటే కేంద్ర క్యాబినెట్లో మరో 24 మందికి చోటు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే, ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేసి ఎంత మందిని తీసుకుంటారనేది క్లారిటీ లేదు కానీ విస్తరణ మాత్రం ఉంటుందనేది ప్రధానంగా వినిపిస్తోంది.ఇందుకు సంబంధించి కొత్త క్యాబినెట్లో చేరే వారు వీరే అంటూ పలు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింథియా పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవలే బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించింది. కేంద్ర మంత్రిని చేయడానికే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారనేది బహిరంగంగానే చర్చ జరుగుతోంది. నిజానికి ఆయనకు బీజేపీలోకి వెళ్లకముందే ఈ హామీ లభించిందనే ప్రచారం కూడా ఉంది.మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా కొత్తగా క్యాబినెట్లోకి వెళ్లబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు తమ పార్టీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా కొందరిని మంత్రివర్గంలోకి తీసుకొని రెండు రాష్ట్రాల్లో బలపడేందుకు అవకాశంగా మలుచుకోవాలనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ఉన్నారనే విశ్లేషణలు ఉన్నాయి. నిజానికి బీజేపీ హయాంలో కేంద్ర మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు.యూపీఏ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మందికి పైగా కేంద్ర మంత్రులు ఉండేవారు. కానీ, మోడీ మొదటి సారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ నుంచి కేవలం బండారు దత్తాత్రేయకు స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రపక్షం టీడీపీ తరపున అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. తర్వాత బీజేపీ - టీడీపీ బంధం బీటలు వారిన తర్వాత వీరిద్దరూ మంత్రి పదవులు వదులుకున్నారు. తర్వాత ఎవరికి ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా లేరు.మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి ఛాన్స్ వస్తుందని అంతా ఊహించినట్లే జరిగింది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆయనకు ఒక్కరికి ఛాన్స్ వస్తుందనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. కేవలం కిషన్ రెడ్డి సహాయ మంత్రి పదవిని మాత్రమే ఇచ్చి ఊరుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తే కచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి కొందరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ నుంచి చూస్తే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పేరు వినిపిస్తోంది. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవడానికి కొత్త ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుకు ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఏపీ నుంచి ఒక్క కేంద్ర మంత్రి కూడా లేనందున ఈ సారి ఒక్కరికైనా ఛాన్స్ లభించవచ్చు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి టీడీపీ నుంచి వెళ్లిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఉన్నారు. వీరిలో సుజనా చౌదరి ఇప్పటికే మంత్రివర్గంలో పని చేసి ఉండటంతో పాటు ఆయనకు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన బీజేపీ వ్యూహకర్తల్లో ప్రధాన వ్యక్తి. ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాల్లో బీజేపీకి విజయాలు అందించారు. దీంతో ఆయన పేరు కూడా కేంద్ర క్యాబినెట్ రేసులో వినిపిస్తోది. మరో నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు కూడా పరిశీలించవచ్చు. వీరిద్దరిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపించాల్సి ఉంటుంది.