
రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కో్సం తెలంగాణలో అవిరళ కృషి జరుగుతున్నదని, సబ్బండ వర్గాలకు సమ న్యాయం చేయడానికి సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని, అందుకు ఆయన చేపట్టిన గొర్రెల పెంపకం, దళితులకు భూ పంపిణీ వంటి అనేక కార్యక్రమాలే ఉదాహరణ అని అన్నారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి.
భారతరత్న డాక్టర్. బి.అర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా బూర్గుపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. బాదేపల్లి పాతబజారులో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. అలాగే అంబేద్కర్ చౌరస్తా దగ్గర డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. బూర్గుపల్లి గ్రామంలో కురుమ యాదవులకు సబ్సిడీ పై ఇచ్చిన గొర్రెలకు దాన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ, దేశ చరిత్రలో అంబేద్కర్ పాత్ర అమోఘమైనదన్నారు. అణగారిన, దళితుల హక్కుల కోసం ఆనాడే పోరాడిన ముందుచూపు, విజన్ ఉన్న వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఆయన కృషి ఫలితంగానే అత్యంత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు సంప్రాప్తించాయన్నారు. అందరూ అభివృద్ధి చెందాలని అంబేద్కర్ ఆశించారన్నారు. అందుకే ఆటు రాజ్యంగంలోనూ, ఇటు సామాజిక పరంగా ఆయన చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ నాటి సమాజమన్నారు. సరిగ్గా తెంగాణ సీఎం కెసిఆర్ కూడా అంబేద్కర్ ఆశయాలను తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారని చెప్పారు. కెసిఆర్ చేపట్టిన పథకాలే అందుకు నిదర్శనమన్నారు. దళతులకు మూడెకరాల భూ పంపిణీ, రైతాంగానికి పంట పెట్టుబడులు, దళిత, మైనార్టీ, బీసీ వర్గాలకు అనేక పథకాల్లో వంద శాతం సబ్సిడీలు, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఘనత తెలంగాణ సీఎం కెసిఆర్కే దక్కుతుందన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాల పునరుద్ధరణతోపాటు, నిరు,కడు పేదరికంలో మగ్గుతున్న బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత కూడా సీఎం కెసిఆర్కే దక్కుతుందన్నారు.
మరోవైపు అన్ని కుల వృత్తులను ఆదుకుంటూ గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, పంపిణీ చేపట్టారన్నారు. ఇక త్వరలోనే బర్రెల పంపిణీ పథకాన్ని కూడా చేపట్టాలని కెసిఆర్ ఆలోచిస్తున్నరాన్నారు. అనేక ఏళ్ళుగా వర్గీకరణ కోసం పరితపిస్తూ, ఉద్యమించినా సఫలం కాలేక పోతున్న దళితుల కోసం వర్గీకరణ బాధ్యతని అసెంబ్లీ సాక్షిగా నెత్తిన వేసుకున్న ఘనత కూడా కెసిఆర్దే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు ఇవన్నీ చేపట్టిన సిఎం కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వం వైపు దేశమంతా చూస్తున్నదన్నారు. ఇప్పుడిక తెలంగాణలో పథకాలు అమలు అతున్నాయని, వాటి ఫలితాలు కూడా ప్రజలు చూస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.
ఇప్పుడిక దేశానికి ఒక కెసిఆర్ కావాలని, దేశ ప్రజలంతా కెసిఆర్ కోసం చూస్తున్నారని, మూడో ఫ్రంట్ ద్వారా కెసిఆర్ దేశాన్ని కూడా మరో బంగారు తెలంగాణలాగా తీర్చిదిద్దుతారన్న ఆశాభావాన్ని మంత్రి లక్ష్మారెడ్డి వ్యక్తం చేశారు. కెసిఆర్ దేశస్థాయికి వెళితే, రాష్ట్రం మరింత బాగుపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేలా చూడాలని, వాటి ఫలాలు ప్రజలకు అందిన నాడే, అంతా బాగు పడి అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని మంత్రి లక్ష్మారెడ్డి ఉద్బోధించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీల నేతలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.