చెన్నై,అక్టోబరు 26,
కమల్ హాసన్ రజనీకాంత్ లాగా కాదు. ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి ఓడినా, గెలిచినా దాని వెంటే తిరుగుతున్నారు. పార్టీ కోసం సమయం వెచ్చిస్తున్నారు. కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకపోయినా కమల్ హాసన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన సమాయత్తమవుతున్నారు.వచ్చే సంవత్సరం తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అధికార డీఎంకే, అన్నాడీఎంకేలు కూటములు కట్టి బరిలోకి దిగుతున్నాయి. డీఎంకే కాంగ్రెస్ తోనూ, అన్నాడీఎంకే బీజేపీతోనూ జట్టుకట్టి చిన్నా చితకా పార్టీలను తమ కూటమిలోకి చేర్చకున్నాయి. కానీ కమల్ హాసన్ మాత్రం ఏ కూటమిలో చేరేందుకు ఇష్టపడటం లేదు. ఆయన రజనీకాంత్ పార్టీ పెడితే ఆయనతో కలసి నడవాలనుకున్నారు.రజనీకాంత్ పార్టీపై స్పష్టత లేకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో కమల్ హాసన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు తమిళనాడులో కీలకంగా ఉన్న పార్టీల నేతలతో కమల్ హాసన్ చర్చలు జరిపారని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో తృతీయ కూటమి అవసరమని కమల్ హాసన్ గట్టిగా భావిస్తున్నారు. కమల్ హాసన్ ఏ కూటమిలోకి వెళ్లినా ఆయన పార్టీకి కేటాయించే స్థానాలు తక్కువగానే ఉంటాయి. అందుకే ఆయన తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు.అలాగే కమల్ హాసన్ కు ఒక గోల్ ఉంది. అది నెరవేరుతుందా? లేదా? అన్నది పక్కన పెడితే తమిళనాడుకు తాను ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నారు. రజనీకాంత్ అలా కాదు. తాను ముఖ్మమంత్రి అభ్యర్థిని కాబోనని రజనీ ప్రకటంచి అభిమానులకు షాక్ ఇచ్చారు. కానీ కమల్ హాసన్ మాత్రం అలా కాదు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా మరో కూటమిని ఏర్పాటు చేసి దానికి నేతృత్వం వహించాలని భావిస్తున్నారు. మరి కమల్ హాసన్ ప్రయత్నాలు ఫలిస్తాయో? లేదో? చూడాలి.