150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే
హైద్రాబాద్ అక్టోబరు 30,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో మళ్లీ కదలిక మొదలైంది. తాజా ప్రతిపాదనల మేరకు నవంబర్ రెండో వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కసరత్తు చేస్తోంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినప్పటికీ ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా జనవరి చివరలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండొచ్చని అంతా భావించారు. కానీ మళ్లీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాలతో జిహెచ్ఎంసి జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వీలైనంత వేగిరం చేస్తున్నారు.తదనంతరంఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లుగా రాజకీయ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నగరంలో వరద బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న రూ.10 వేల సాయాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ, రహదారుల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కూడాఆదేశించింది. అలాగే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడవచ్చనే సంకేతాలను కూడా స్పష్టంగా ఇచ్చిన్నట్లుగా వినిపిస్తోంది.జిహెచ్ఎంసి చట్టానికి ఇటీవల చేసిన సవరణ మేరకు ప్రస్తుతం ఉన్న డివిజన్ల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించనున్నారు. అలాగే మహిళలకు 2016లో అమలైన 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించింది. ఈ మేరకు 150 డివిజన్లలో 75 పూర్తిగా మహిళలకే కేటాయిస్తారు. ఈ సారి కూడా మేయర్ పీఠం కూడా వారికే కేటాయించారు. దీంతో జిహెచ్ఎంసిలో మహిళా నేతల సందడి మరింత పెరగనుంది. కాగా 2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికంగానే తీసుకుని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల ముందురోజు వరకు అనుమతించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 వరకు ఉన్నా 3 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు తాజా సవరణలు అనుమతిస్తున్నాయి. అంతా సవ్యంగా సాగితే జిహెచ్ఎంసి కొత్త పాలకవర్గం 45 రోజుల ముందుగానే కొలువుదీరనుంది.బల్దియా ఎన్నికలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు (ఆర్ఒ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను (ఎఆర్ఒ) నియమించారు. ఈ మేరకు జిహెచ్ఎంసి పంపిన జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్ల వారీగా 150 వార్డులకు ఆర్ఒలు, ఎఆర్ఒలతోపాటు రిజర్వులో ఉండేందుకు కూడా అధికారులను నియమించారు