మొగోడు రుజువు చేసినా సీఎం పదవికి రాజీనామా చేస్తా!
ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్
జనగామ అక్టోబర్ 31
పెన్షన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తుందని ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు.జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతువేదికను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగుతుంది.అక్కడ బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు. మన రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. అందరికీ నెల రాగానే పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. మనిషికి 200 మాత్రమే కేంద్రం ఇస్తుంది. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ. 105 కోట్లు మాత్రమే. రాష్ర్టం రూ. 10 వేల కోట్ల నుంచి 11 వేల కోట్లు ఇస్తుంది. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి. కాగ్ లెక్క తీసి అధికారికంగా విడుదల చేసింది. తాను చెప్పే లెక్కలన్నీ కాగ్ వద్ద ఉన్నాయి. ఒక వేళ తాను చెప్పేది అబద్ధమే అయితే, ఎవడన్న మొగోడు రుజువు చేస్తే తాను ఒక్కటే నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతాను. ఓట్ల కోసం ఘోరమైన మోసాలు చేస్తున్నారు. హృదయంలో నిజమైన ప్రేమలేదు.. వారికి ఓట్లు మాత్రమే కావాలి. ఈ మధ్యనే కేంద్రం వ్యవసాయ బిల్లు తెచ్చింది. గుండాగిరి చేసి బిల్లును ఆమోదించుకున్నారు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.