హైదరాబాద్, నవంబర్ 24,
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ను తలదన్నేలా వైద్యసేవలు అందుతున్నాయి. కొండాపూర్ డివిజన్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. 100 పడకల సౌకర్యం కలిగిన జిల్లా దవాఖానలో నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు చికిత్స కోసం ఈ దవాఖానకు వస్తుంటారు. ముఖ్యంగా గర్భిణులు పరీక్షలు చేయించుకునేందుకు, కాన్పులకు అధికంగా వస్తుంటారు. దీంతో పాటు ఇటీవల అత్యవసర సేవలు అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను ప్రారంభించారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసి అత్యవసర విభాగాన్ని ప్రారంభించింది. దవాఖానలో 16 మంది వైద్యులు, 22 మంది నర్సులతో పాటు ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్నారు. నిత్యం 400 నుంచి 500 మంది రోగులు ఔట్ పేషంట్లుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దవాఖానలో చేరిన రోగులకు వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని కూడా ఉచితంగా అందజేస్తున్నారు. కొవిడ్-19తో ప్రపంచం గడగడ లాడుతుండగా.. దానిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. వైరస్ బారిన పడిన రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక వార్డును సైతం ఏర్పాటు చేసింది. కరోనా బారిన పడిన వారిని కార్పొరేట్ దవాఖానలు దోపీడీ చేస్తుండగా.. వారి నుంచి పేద, మధ్య తరగతి ప్రజలను రక్షించేందుకు రంగారెడ్డి జిల్లా దవాఖానలో కొవిడ్ వైద్య సేవలను ప్రారంభించింది. దవాఖాన ఆవరణలోనే ప్రత్యేకంగా కొవిడ్ టెస్ట్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో పాటు పాజిటివ్ వచ్చి హోం ఐసోలేషన్లో ఉన్న వారికి కూడా ఉచితంగా మందులు అందిస్తున్నారు. దీంతో పాటు దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఐసీయూ సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా స్త్రీలు, గర్భిణులకు చికిత్స అందించేందుకు గైనకాలజిస్టులు, శస్త్ర చికిత్సల నిపుణులు, జనరల్ ఫిజీషియన్, ఎముకలు, చిన్న పిల్లల వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు షిఫ్టుల వారీగా డ్యూటీ డాక్టర్లు 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ దవాఖానకు వచ్చే వారికి వైద్యం అందిస్తున్నారు. త్వరలోనే దవాఖానలో కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధి కారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రోగులకు మరింత మెరుగైన సేవలను అందిస్తున్నాం. ప్రైవేట్ కంటే ప్రభుత్వ దవాఖానలోనే ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో వైద్యం అందించేందుకు ప్రైవేటు వైద్యులను కూడా నియమిం చాం. ప్రభుత్వ దవాఖాన అంటే నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాం.