నాగార్జున సాగర్ బైపోల్స్.. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ కూడా రాలేదు. అప్పుడే స్థానిక రాజకీయం వేడెక్కింది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల కుటుంబానికి టికెట్ రాకుండా పావులు కదుపుతున్నారు ప్రత్యర్ధులు అనే ప్రచారం కూడా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి బరిలోకి దిగుతారనే కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయం విషయంలో కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ను దెబ్బకొట్టే మరో అవకాశం ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. టీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తోంది. ఉపఎన్నికలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పలువురు కోరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా స్థానికత అంశాన్ని బలంగా తెరపైకి తీసుకురానున్నారు. నోముల నర్సింహయ్య బతికున్న సమయంలో ఆయన్ను వ్యతిరేకించిన వాళ్లే ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. నకిరేకల్కు చెందిన నోముల నర్సింహయ్య 2014లో తొలిసారి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాన్ లోకల్ నేతకు టికెట్ ఇవ్వొద్దని ప్రచారం చేయగా.. ఆ కారణంగానే ఆ ఎన్నికల్లో నోముల ఓడిపోయారని ఇప్పటికీ చెప్పుకొంటూ ఉన్నారు. 2018లోనూ ఇలాంటి ప్రచారమే చేశారు.. కానీ నోముల మాజీ మంత్రి జానారెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యాడు.ఇప్పుడు ఉప ఎన్నికలో కూడా అదే తరహాలో ప్రజల్లోకి వెళ్లాలని నోముల వ్యతిరేకులు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పెద్దలు కూడా బలమైన అభ్యర్థి వేటలో ఉన్నారనే ప్రచారం కూడా కొనసాగుతోంది.బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్న నాయకులు కొందరైతే.. లాబీయింగ్ చేయాలని అనుకుంటున్న నేతలు కూడా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దని స్థానిక టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేశారు. వారిని కాదని టీఆర్ఎస్ రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చారు. ఫలితం ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారిగా బీజేపీ పుంజుకోవడం మొదలైంది. ఇప్పుడు నాగార్జునసాగర్లోనూ అలాంటి ఇబ్బందులే ఏమైనా ఎదురవుతాయేమోనని టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలా అనే విషయంలో టీఆర్ఎస్ ప్రణాళికలను రచిస్తూ ఉంది.