రానున్న ఐదారేళ్ల వ్యవధిలో దేశంలోని సహజవాయు పైప్లైన్ల నెట్వర్క్ను రెండింతలు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం 1,500గా ఉన్న సీఎన్జీ స్టేషన్ల సంఖ్యను పది వేలకు పెంచనున్నట్లు వెల్లడించారు. కొచ్చి-మంగళూరు మధ్య నిర్మించిన సహజవాయువు పైపులైన్ను ఆవిష్కరించి జాతికి అంకితమిచ్చారు మోదీ. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 'ఒకే దేశం-ఒకే గ్యాస్ గ్రిడ్'లో భాగంగా కొచ్చి-మంగళూరు పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పైప్లైన్ను జాతికి అంకితమివ్వడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. భారత ప్రజలకు, ముఖ్యంగా కేరళ, కర్ణాటక వాసులకు ఈరోజు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఇతర నగరాల్లో కొత్త గ్యాస్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యేందుకు ఈ పైప్లైన్ దోహదం చేస్తుందని చెప్పారు. భారత వృద్ధి కోసం వాయు, జల, రోడ్డు మార్గాలతో పాటు రైల్వే, మెట్రో, డిజిటల్, గ్యాస్ కనెక్టివిటీని సైతం మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.