భువనేశ్వర్ జనవరి 6
ఒడిశాలోని రూర్కేలా స్టీల్ ప్లాంట్లో గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని ఓ యూనిట్లో విషపూరిత గ్యాస్ లీకైనట్లు అధికారులు గుర్తించారు. బుధవారం ఉదయం కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ ప్లాంట్ నుంచి విషపూరితమైన గాలి వ్యాపించింది. దాన్ని పీల్చిన నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ప్లాంట్లో 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్పృహ తప్పిపడిపోయిన వారిని ప్లాంట్ సమీపంలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ఇస్పాట్ జనరల్ హాస్పిటల్కు మరో నలుగురిని మార్చారు. గ్యాస్ లీకైనట్లు వార్త వ్యాపించగానే.. ప్లాంట్కు చెందిన అగ్ని మాపక సిబ్బంది అక్కడకు వచ్చింది. కోల్ కెమికల్ సైట్లోని సేఫ్టీ వాల్వ్ సడన్గా పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.