తెలంగాణలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటా పోటీ విమర్శలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటలతో దాడులు చేసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిత్యం విమర్శలు చేసే బీజేపీకి ఈసారి కేటీఆర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే పోటీ పడదామన్నారు. ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని...హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు కేటీఆర్.
ఇవాళ హెచ్ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 18 వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 28 రాష్ట్రాలలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని.. విలువైన ఇళ్ళు ఇవాళ ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు ఎవరికీ కిరాయి ఇవ్వకుండని.. అమ్ముకోవద్దని కోరారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో కేంద్రం సహకారం అందించాలని మంత్రి కోరారు. కంటోన్మెంట్లోని డిఫెన్స్ భూముల్లో పట్టాలు ఇప్పించేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలా ఉన్న ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి సమన్వయంతో పని చేయాలని కోరారు. రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ, కొట్లాటలు సరికాదు అని కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. కేటీఆర్ బీజేపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
రేవంత్ అరెస్ట్
మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైఠాయించారు. రోడ్డుపై టీఆర్ఎస్ జెండాలు చించేస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వంక కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలోని వాసవి నగర్లో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత జరిగింది. టైం కంటే ముందే ప్రారంభించి పోయారు అంటూ రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.సమయం 12 గంటలకు ప్రారంభోత్సవం ఉండగా ముందుగానే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి అక్కడ నుండి మంత్రి కేటీఆర్ వెళ్లిపోయారు. ప్రారంభోత్సవానికి సమయం కంటే ముందే ఎలా చేస్తారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డినీ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగాడు. కేటీఆర్ సిగ్గు సిగ్గు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కార్యక్రమ ఫ్లెక్సీలను కూడా చింపేశారు. టైం కంటే ముందే ప్రారంభించి పోయారు అంటూ రేవంత్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్న అధికారులను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో వాగ్వాదానికి దిగారు. ప్రతిసారి ఇలాగే తప్పించుకు పోయే ప్రయత్నం చేస్తున్నారని..టైం కంటే ఎలా ముందు ప్రారంభోత్సవం చేస్తారంటూ కార్యకర్తలతో పాటు రేవంత్ రెడ్డి ర్యాలీగా రోడ్డు పైకి వచ్చారు.కేటీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు ముందస్తు చర్యగా రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
నాయని కల నెరవేరింది
బాగ్లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు... లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవడంతో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఇండ్ల పంపిణీ జరగడం సంతోషకరమన్నారు. లంబాడీ తండాలో రూ. 10 కోట్ల 90 లక్షలతో 126 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో ఇంటిపై రూ. 9 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఈ ఇండ్లను కిరాయికి ఇవ్వడం, అమ్మడం లాంటివి చేయొద్దు. పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మార్కెట్లో రూ. 50 లక్షలు ధర పలికేలా ఇండ్లను పేదలకు కట్టించి ఇస్తున్నాం. పేదలు ఆత్మగౌరవంతో బతికేలా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామన్నారు.
ఏడేళ్లలో లక్షమందికి ఉపాధి
తెలంగాణలో రానున్న ఏడేళ్లలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న ఐదేళ్ల నుంచి ఏడేళ్ల మధ్యలో రాష్ట్రానికి ఐదు అతిపెద్ద కంపెనీలు రాబోతున్నాయని వెల్లడించారు. హైదరాబాద్లొ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్టస్టర్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉందనే దాని గురించి పలు విషయాలను తెలియజేశారు.నూతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలంగాణ ఎంతో పురోగతి సాధించిందని కొనియాడారు. కొత్త ఆవిష్కరణలకు క్లస్టర్ ఉపయోగపడుతుందని, పౌర జీవనంలో పలు మార్పులు సంభవిస్తాయని వివరించారు. ధీర్ఘకాలికంగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నామని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు ప్రధాని నరేంద్రమోదీ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్లో అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దీంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే ప్రభుత్వ నోటిఫికేషన్లు కూడా ఉంటాయి కనుక రాష్ట్రంలోని నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినయోగం చేసుకోవాలని సూచించారు.