బెంగళూరు జనవరి 11
భారతదేశ విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనత సాధించారు. అత్యంత సుదూర ప్రయాణం చేసి ప్రపంచానికి చెరో కొసన ఉన్న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు విజయవంతంగా తిరిగివచ్చారు. ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు 16 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో (స్థానిక కాలమానం ప్రకారం) శనివారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి.. సోమవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. తమ ప్రయాణంలో ఎక్కడా ఆగకుండా వారు విమానాన్ని నడపడం విశేషం. ఈ విమానాన్ని నడిపినవారిలో కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరె, కెప్టెన్ శివానీ మన్హాస్ ఉన్నారు. కెప్టెన్ తన్మయి మన తెలుగమ్మాయి కావడం విశేషం.