బెంగళూరు జనవరి 12,
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ కారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య విజయ, వ్యక్తిగత సహాయకుడు దీపక్ దుబే మరణించారు. ఆయనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా తాలూకా అంకోలా గ్రామంలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. గోకర్ణ నుంచి ఎల్లాపూర్కు కారులో వెళుతున్న నాయక్ దంపతులు అంకోలా గ్రామం సమీపంలోకి వచ్చేసరికి ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రికి గోవా లోని బంబోలిన్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. మంత్రి ప్రయాణిస్తున్న టోయాటో ఇన్నోవా కారు వేగంగా వస్తూ అదుపు తప్పింది. రోడ్డు పక్కన వున్న చెట్టును ఢీకొని పల్టీ కొడుతూ గోతిలో పడిందని సమాచారం. ఘటన సమయంలో కారులో వున్న మంత్రి అంగరక్షకుడు, అయన స్నేహితుడు, కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారికి స్థానికంగా చికిత్స అందించారు.