హైదరాబాద్ జనవరి 21
హైదరాబాద్ శివారులోని జినోమ్ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ (వాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్) కేంద్రం ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్ర వైద్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు చేసిన సూచనపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఆ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటూ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీన్ని పత్రికల్లో చదివిన తర్వాత కేంద్ర మంత్రి హర్షవర్ధన్తో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. కరోనా వైరస్ మహమ్మారికి హైదరాబాద్ కేంద్రంగా టీకాను రూపొందించడంతోపాటు 600 కోట్ల టీకాలు ఉత్పత్తి చేసిన సామర్థ్యాన్ని ఈ సందర్భంగా ప్రస్థావించారు. దీనికి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తానని హర్షవర్ధన్ చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు సంపాదించాల్సి ఉంటుందన్నారు. ప్రపంచంలో ఇటువంటి కేంద్రాలు ఏడు మాత్రమే ఉన్నాయని.. అందువల్ల ఈ విషయాన్ని అన్నికోణాల్లో పరిశీలించి నిర్ణయించాల్సిఉంటుందని.. ఈ సూచనను ఉన్నతస్థాయిలో పరిశీలిస్తామని ఉపరాష్ట్రపతికి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.