బెంగళూరు జనవరి 21
తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళను గురువారం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. శశికళ బుధవారం జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్ జైలు నుంచి భద్రత మధ్య నగరంలోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా పరీక్షతోపాటు మిగతా వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శశికళకు మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి గురువారం తరలించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు తరలిరాగా వారికి నమస్కరించడంతోపాటు చేయి ఊపి అభివాదం చేశారు.కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతోపాటు మంచి ప్రవర్తన వల్ల ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తున్నది.