వరంగల్, జనవరి 22,
ప్రతి చిన్నారికి పౌష్టికాహారం, ప్రాథమిక స్థాయిలోనే విద్యను అందించడంతోపాటు బాలింతలు, గర్భిణీలకు సమతుల్య ఆహారం అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు నిర్దిష్టమైన యూనీఫాంను కేటాయించింది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వం ఉన్నతంగా ఉంచడంతోపాటు చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగానే అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం ఈసారి చేనేత వస్ర్తాలను యూనీఫాం కింద అందించేందుకు చర్యలు చేపడుతుంది. అంగన్వాడీ టీచర్లకు క్రీమ్ కలర్తో కూడిన చేనేత చీరలను, ఆయాలకు బ్లూ కలర్ చేనేత చీరలను అందజేయనున్నది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం చేయడంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలకు జీతాలను పెంచి, వారి సమస్యలను పరిష్కరించింది. ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తూ ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి వేతనాలను సైతం మరో మారు పెంచే ఆలోచనలు చేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర చర్యలతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 844 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 57 మినీ అంగన్వాడీ కేంద్రాలను కలుపుకుని మొత్తం 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో పని చేస్తున్న 901 టీచర్లకు, 844 మంది ఆయాలకు రెండు జతల చొప్పున చేనేత చీరలను అందించనున్నారు.అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి గతంలోనే వేతనాలను భారీ స్థాయిలో పెంచి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. అంగన్వాడీ టీచర్లకు గౌరవ వేతనం రూ.10వేలు, ఆయాలకు రూ.7,500 అందిస్తుండగా, ప్రభుత్వం మరో మారు గౌరవ వేతనాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతుంది. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రభుత్వం గతంలో కన్నా భిన్నంగా ఉండేందుకు చేనేత చీరలను యూనిఫాంగా అందజేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో అంగన్వాడీ సిబ్బందికి పంపిణీ చేపడుతాం. అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.