YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో మరో దెయ్యం కేసు

విశాఖలో మరో దెయ్యం కేసు

విశాఖపట్టణం, ఫిబ్రవరి 3, 
విశాఖపట్నం నగర శివారులోని గాజువాక అజీమాబాద్‌లోని ఓ కుటుంబం అర్ధరాత్రి పూజలు చేస్తూ, అందరినీ భయబ్రాంతులకు గురిచేసిన వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారని కొందరు ప్రచారం చేయగా, మానసిక రుగ్మత కారణంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక అజీమాబాద్‌ ప్రాంతంలో అబ్దుల్‌ మజీద్‌ (46), భార్య మెహ్రు (40), కొడుకు నూరుద్దీన్‌ (24), కుమార్తె నూరి (20)తో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో మజీద్‌ తన కుటుంబంతో కలిసి బిగ్గరగా మంత్రాలు చదువడం ప్రారంభించారు. దీంతో మజీద్ ఇంటికి అతడి అన్న వలీ వెళ్లాడు. తలుపు కొట్టినా తెరవకపోవడంతో వెనుతిరిగాడు. మళ్లీ మర్నాడు ఉదయం వెళ్లగా.. అప్పుడు కూడా పెద్దపెద్ద శబ్ధాలతో మంత్రాలు వినబడడంతో అనుమానం వచ్చి వలీ తలుపు తెరవాలని కోరాడు. అయితే, ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో స్థానికులతో కలిసి వెళ్లి తలుపు తీయాలని ఒత్తిడి చేశారు. బలవంతంగా తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా.. ఇంట్లోకి వస్తే గొంతుకోసుకొని చచ్చిపోతామంటూ ఆ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.దీంతో పోలీసులకు స్థానిక ప్రజలు సమాచారం ఇచ్చారు. గాజువాక ఎస్సై గణేష్, సిబ్బందితో ఇంటికి రాగా, ‘తలుపు తీయొద్దు.. తలుపు తీసి వస్తే మేమంతా కత్తితో పొడుచుకుంటాం’ అని లోపలి నుంచి హెచ్చరించారు. తర్వాత మళ్లీ గట్టిగా మంత్రాలు చదవడం ప్రారంబించారు. ఎంతకీ అరుపులు తగ్గకపోవడంతో గోడెక్కి గదిలోకి దూకేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఇక, చేసేది లేక.. తలుపు విరగ్గొట్టి లోపల ఉన్న నలుగురిని వెంటనే బయటకు తీసుకొచ్చారు. దీంతో మైకం కమ్మినట్లుగా ఊగిపోతూ.. ఒకరి మీద మరొకరు ఇంటి వద్దే పడిపోయారు. తర్వాత స్థానికుల సాయంతో బలవంతాన గాజువాకలోని ప్రైవేలు ఆస్పత్రికి తరలించారు. అయితే మానసిక రుగ్మత వల్లే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు తెలిపారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు నలుగురినీ విశాఖలోని మానసిక వైద్య శాలకు తరలించారు.అబ్దుల్‌ మజీద్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, కొడుకు నూరుద్దీన్‌ క్యాబ్‌ నడుపుతున్నాడు. కుమార్తె నూరీ డిప్లొమా చదువుతోంది. చక్కగా వుండే కుటుంబం ఒక్కసారిగా ఇలా వింతగా ప్రవర్తించడం ఏమిటో అర్థం కావడం లేదని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అయితే, తొలుత కుమారుడు నూరుద్దీన్‌కు మానసిక స్థితి బాగుండేది కాదని.. దెయ్యాలు, భూతాలు అంటూ ఇంట్లో వారిని కూడా ఇలా మార్చాడని పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై గాజువాక లా అండ్‌ ఆర్డర్‌ సీఐ హెచ్‌.మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. నలుగురు బాధితులను మాత్రం మానసిక వైద్య శాఖకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, చిత్తూరు జిల్లా మదనపల్లెలో పూజలు చేసి ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే దారుణంగా హత్య చేసిన ఉదయం ప్రకంపణలు రేపుతున్న తరుణంలో విశాఖలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేపింది. అయితే స్థానికులు, పోలీసులు సకాలంలో స్పందించి, వారిని మానసిక వైద్య శాఖలకు తరలించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు.

Related Posts