కరీంనగర్ తప్పుల తడకగా ఇంటి నెంబర్లు
కరీంనగర్, ఫిబ్రవరి 6,
మున్సిపాలిటీల పరిధిలో ఆస్తుల నంబర్లు తప్పుగా నమోదు కావడం, ఒకే నంబర్ రెండు ఇండ్లకు కేటాయించడం లాంటి సమస్యలు పరిష్కరించే అవకాశం ఇప్పటివరకు మున్సిపల్ కమిషనర్లకు లేదు. రాష్ట్ర మున్సిపల్ శాఖకు పంపించేవారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ రీజినల్ డైరెక్టర్లు, కమిషనర్లకు అవకాశం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆస్తుల వివరాల్లో తప్పులకు సంబంధించి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు రాష్ట్ర మున్సిపల్ శాఖ పంపించారు. కానీ, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లోనే మార్పులు చేసుకునేం దుకు కమిషనర్లు, రీజినల్ డైరెక్టర్లకు అవకాశమిచ్చింది. ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీల్లో కలిపి సుమారుగా 5 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్, రామగుండం, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీల పరిధిలో 3500, హుజురాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, వేములవాడ, 1400కు పైగా అర్జీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో అత్యధికంగా ఆస్తి పన్ను మదింపులను మరోసారి పరిశీలించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆస్తుల వివరాల్లో మార్పులు చేర్పుల విషయం లో అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని సీడీఎంఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పేర్ల విషయంలో అక్షర దోషాలే తప్పా పూర్తి పేర్ల మార్పిడికి అవకాశం లేదని తేల్చిచెప్పింది. అలాగే ఆస్తి మదింపు విషయంలోనూ ఆన్లైన్లోనే మార్పులు చేయాలని సూచించింది.