YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సాగర్ కోసం గులాబీ బాస్

సాగర్ కోసం గులాబీ బాస్

సాగర్ కోసం గులాబీ బాస్
హైదరాబాద్, ఫిబ్రవరి 6, 
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడినల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చ జరిగింది.వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా, మిగిలిన ఆయకట్టుకు సాగు నీరు అందించడానికి అనువుగా రూ.3 వేల కోట్లతో నెల్లికల్లుతో పాటు 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికి ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10న మద్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి నోముల కుటుంబ సభ్యుడికి సీటిస్తారా? లేక మరొకరిని ఎంపిక చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అసలే మంచి ఫాంలో ఉన్న బీజేపీ ఆ స్థానాన్ని కూడా ఎగరేసుకుపోకుండా టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. కమలం పార్టీ ఇక్కడ ఎవరిని బరిలోకి దింపుతుందన్న విషయంపై టీఆర్ఎస్ అభ్యర్థి ఆధారపడి ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని బరిలో నిలుపుతున్న సంగతి తెలిసిందే.ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్ జిల్లా నేతల అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక మార్చిలో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, సాగర్‌ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్‌లోనే ఉండాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ జిల్లా నాయకులకు సూచించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కనీసం రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది

Related Posts