YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

 ఉక్కుకు ఎవరు దిక్కు

 ఉక్కుకు ఎవరు దిక్కు

 ఉక్కుకు ఎవరు దిక్కు
విశాఖపట్టణం, ఫిబ్రవరి 6,
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ అరవై దశకంలో ఒక ఉద్యమం మొదలైంది. ఆ తరువాత అది పెరిగి పెద్దదై పదేళ్ళ పాటు కొనసాగింది. మొత్తానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీని సైతం తల ఒగ్గేలా చేసి విశాఖకు ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో ఎంతో మంత్రి త్యాగమూర్తులు పాలుపంచుకున్నారు. అలాగే తమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ వస్తే మేలు జరుగుతుందని రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారు. చవకగా వాటిని ప్రభుత్వ పరం చేశారు. అలా 1971లో ఇందిరాగాంధీ చేతుల మీదుగా విశాఖ ఉక్కు కర్మాగారానికి శంఖుస్థాపన జరిగింది.ఇక ఆ తరువాత పదేళ్ళ కాలంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం జరుపుకుంది, 1981 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయి. అపుడు కూడా కేంద్రంలో ఇందిరాగాంధీయే ఉన్నారు. మొత్తానికి నాటి కాంగ్రెస్ ఏలికలు దేశంలోనే భారీ పరిశ్రమలలో ఒకటి అయినా ఉక్కుని విశాఖలో స్థాపించి ఆంధ్రుల మన్ననలు అందుకున్నారు. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. ఉత్పత్తి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుకుని దేశంలోని నవరత్నాలలో ఒకటిగా నిలిచింది. అటువంటి ఉక్కు పరిశ్రమను మరింతగా పెంచి పెద్దది చేయాల్సిన బీజేపీ పాలకులు ఏకంగా ప్రైవేట్ పరం చేస్తున్నారు.విశాఖ ఉక్కు పరిశ్రమను నూటికి నూరు శాతం వాటాలను విక్రయించడానికి కేంద్రం తాజాగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా బాధాకరమని విశాఖ వాసులు అభివృద్ధికాముకులు అంటున్నారు. గత మూడేళ్ళుగా విశాఖ ఉక్కు నష్టాలలో ఉంది. దానికి కారణం సొంత గనులు లేకపోవడం ఇతరత్రా అనేక‌ సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని సరిదిద్ది దేశంలోనే సాగర తీరంలో ఉన్న ఏకైన ఉక్కు పరిశ్రమను కాపాడాల్సిన ఢిల్లీ పెద్దలు ఇదే అదనుగా అమ్మకానికి పెట్టడం పట్ల విశాఖ వాసులతో సహా ఆంధ్రులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఇక విశాఖకు ఏమీ మిగిలిఉండదు అని కూడా అంటున్నారు. ఉక్కు సిటీ అన్న పేరు కూడా చెరిగిపోతుంది అంటున్నారు.విశాఖ ఉక్కు కోసం వేలాది ఎకరాలను నాడు సేకరించారు. మరి అటువంటి ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఉపాధి అవకాశాలు ఎటూ ఉండవు, అనుబంధరంగాలు కూడా కునారిల్లుతాయి. మరి ఇదే జరిగితే ఉక్కుకు ఇచ్చిన భూములు ప్రైవేట్ వారి పరం చేయడం ఎందుకు అన్న మాట కూడా వస్తోంది. విశాఖ ఉక్కుకు రైతులు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. బీజేపీ ఏలుబడిలో అంతా ప్రైవేట్ మయం తప్ప కొత్తగా నిర్మించినది లేదని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వం కొనసాగించాలని వామపక్షాలు కోరుతున్నారు. మరో ఉక్కు ఉద్యమాన్ని నిర్మిస్తామని చెబుతున్నారు. కానీ ఉద్యమాలకు వేళ కాని ఈ వేళలో విశాఖ ఉక్కు నిలుస్తుందా. దానిని కాపాడే దిక్కు ఎవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Related Posts