విశాఖపట్నం ఫిబ్రవరి 8, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం పెట్టు బడుల ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ లో ని ఉద్యోగసంఘాల లో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. పెద్ద ఎత్తున నిరసనలకు శ్రీకారం చుట్టారు. అన్ని సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ ను ప్రకటించాలని కూడా ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి రాజకీయ మద్దతు అవసరమైంది. అదే సమయంలో విశాఖ కు చెందిన మాజీ మంత్రి, వైజాగ్ నార్త్ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉద్యమానికి మరింత ఊతమిస్తుందని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు గంటా శ్రీనివాసరావు కలిశారు. గంటా రాజీనామా ను అన్ని సంఘాల నేతలు ఆహ్వానిస్తూ ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసించారు. ఉద్యమం పురుడు పోసుకునే సమయంలో గంటా లాంటి బలమైన నేత మాకు మద్దతుగా రాజీనామా చేయడంతో ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెరిగిందని, కచ్చితంగా కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాడగలమన్న నమ్మకం కలిగిందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.