హైదరాబాద్ ఫిబ్రవరి 11
మహా నగర ప్రథమ పౌరురాలి ఎన్నిక నేడు మరికాసేపట్లో జరగనుంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తైంది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు ఖరారైపోయాయి. అయితే ఆశావహులు భారీగానే ఉన్నారు. కానీ అధిష్టానం టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతె శ్రీలతను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలియవచ్చింది. దీంతో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి అలకబూనారు. ప్రమాణ స్వీకారం చేసి మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే ఆమె అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.
గతంలో కూడా విజయారెడ్డికి మేయర్ పీఠం దక్కుతుందని పీజేఆర్ అభిమానులు, అనుచరులు భావించారు. అప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను నిరాశపరిచింది. ఈసారైనా మేయర్ పీఠం దక్కుతుందని ఆమె భావించారు కానీ ఈసారి కూడా మొండి చెయ్యి చూపించడంతో విజయారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై మేయర్ ఎన్నికల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.