రాజోలు లో మంచు తెరలు
రాజమండ్రి ఫిబ్రవరి 27,
తూర్పుగోదావరి జిల్లా రాజోలు దీవిని శనివారం తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ మంచు విపరీతంగా పడింది. మంచు తెరల మధ్య సూర్యుడు పున్నమి చంద్రుడులా కన్పించాడు. చలి కారణంగా ప్రజలు గజగజ వణికారు. పొగ మంచు కురుస్తుండడంతో ఇళ్లను వదిలి బయటికి రాని పరిస్థితి. నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న మనిషి కన్పించని పరిస్థితి నెలకొంది. పంట పొలాలు మంచు దుప్పటి కప్పిన పచ్చని తివాచీలా చూపరులకు ఆహ్లాదాన్ని కలగజేశాయి. దట్టమైన పొగమంచుతో రోడ్లన్నింటినీ మంచు దుప్పటి కప్పివేసింది. ఒకపక్క మంచు, మరోపక్క నీరు మంచు భారీగా కురవడంతో ఈ ప్రాంతంలోనే మామిడి, జీడి మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు ఉదయం 8.30 దాటిన కూడా పొగమంచు దట్టంగా వ్యాపించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల కొంచెం అవస్థలు పడ్డారు.