YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

టాటా కు సుప్రీంలో ఊరట

టాటా కు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ, మార్చి 26, 
టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలన్న నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తీర్పునుసుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. లా అప్పీలేట్ ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులు రద్దుచేసింది. టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని పిటిషన్లను అనుమతించిన సుప్రీంకోర్టు.. సైరస్ మిస్త్రీ పిటిషన్లను తిరస్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్దే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.టాటా సన్స్‌లో అణచివేత, దుర్వినియోగంపై మిస్త్రీ వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మిస్త్రీకి అనుకూలంగా లా ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. టాటా సన్స్, గ్రూప్ కంపెనీ బోర్డులో మిస్త్రీ పునఃనియమాకం సహా ఎన్‌సీఎల్ఏటీ ఉత్తర్వులు సెక్షన్ 242లోని నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? ధ్రువీ ఓటింగ్ హక్కులను ట్రైబ్యునల్ అణచివేతగా వర్గీకరించడం సమర్థనీయమా? రతన్ టాటా, నామినీ డైరెక్టర్లకు ట్రైబ్యునల్ దిశా నిర్దేశం చేయగలదా? టాటా సన్స్ (పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీకి) తిరిగి మార్చడానికి అవసరమైన ఆమోదాలను పొందిందా? అనేది న్యాయస్థానం విచారించింది.‘టాటా గ్రూపునకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి చట్టంలోని అన్ని అంశాలూ బాధ్యత వహిస్తాయని మేం గుర్తించాం.. సైరస్ చేసిన విజ్ఞప్తులను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, టాటా సన్స్‌లోని వాటాదారుల నుంచి మిస్త్రీ కుటుంబం నిష్క్రమణ అంశాన్ని మాత్రం కోర్టు వారి ఇష్టానికే వదిలేసింది. టాటా సన్స్‌లో తమ కుటుంబానికి ఉన్న 18.47 శాతం వాటాలను తీసుకోడానికి మిస్త్రీ ఇంతకు ముందు ప్రతిపాదన చేశారు.ఎన్‌సీఎల్‌టీ తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని టాటా సన్స్‌ కోరిన విషయం తెలిసిందే. టాటా సన్స్ 2016 లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగించి, కొన్ని నెలల తరువాత ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కొనసాగుతున్నారు. మిస్త్రీ తొలగింపుపై సుదీర్ఘ న్యాయపోరాటంలో టాటా గ్రూప్ విజయం సాధించింది.

Related Posts