కాకినాడ, మార్చి 27,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు జిల్లాల నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పదవుల విషయంలోనూ ఆ రెండు జిల్లాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. అతి పెద్ద జిల్లాలయిన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను జగన్ పట్టించుకోవడం లేదన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. భవిష్యత్ లో ఈ రెండు జిల్లాలు తమకు పెద్దగా కలసి రావనే జగన్ భవిస్తున్నారా? అన్నది కూడా అనుమానంగా ఉంది.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలే వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే అందులో 15 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక పశ్చిమ గోదావరి జల్లాలో 14 నియోజవవర్గాలుంటే 12 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక పార్లమెంటు స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాలు తనకు కలసి రావన్న అంచనాలో జగన్ ఉన్నట్లుంది.ఇటీవల ఎమ్మెల్సీ పదవులను జగన్ భర్తీ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నేతలకు ఆరుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. కానీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ దఫా ఛాన్స్ దక్కలేదు. గతంలో పండుల రవీంద్ర బాబుకు ఇచ్చినా ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయినందునే ఇచ్చారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో తోట నరసింహం కుటుంబం ఎన్నికలకు ముందు పార్టీలో చేరంది. పెద్దాపురంలో తోట వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఎన్నికల అనంతరం తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కానీ వీరిలో ఎవరికీ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పెద్దబాబుకు, కొయ్య మోషెస్ రాజుకు ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. అయితే కాపు సామాజికవర్గం ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉండటం, వచ్చే ఎన్నికల్లో తమకు ఈ వర్గం అండగా నిలబడదన్న కారణంతో జగన్ పదవులకు ఈ జిల్లాల నేతలను దూరం పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.